చంద్రబాబువి లాబీయింగ్ రాజకీయలు
సాక్షి, విజయనగరం: ప్రత్యేక హోదాకోసం వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హోదాకోసం పోరాడతామనడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. హోదా విషయంలో చంద్రబాబు ప్రవర్తన విచిత్రంగా ఉందని, హోదా కోసం కలిసి రండి అని పిలిస్తే హోదా సంజీవని కాదని ప్రజలను మభ్యపెట్టారని సీఎంపై విమర్శల వర్షం కురిపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో టిడిపికి ఓటేయండని అడిగిన పవన్..ఇప్పుడు మీ తప్పులు ఎత్తిచూపితే అతనిపై ఎదురుదాడి దిగుతారా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజల సంక్షమం గురించి ఎప్పుడు కృషి చేయని చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని వీరభద్రస్వామి విమర్శించారు. నాలుగేళ్లుగా ఎవరు హోదాకోసం పోరాడుతున్నారో ప్రజలకు వాస్తవాలు తెలుసని, ప్రజలు బాబుని క్షమించరని రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్దిచెప్తారన్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కేంద్రంతో లాబీయింగ్ చేయాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదని తేల్చిచెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు కేంద్రంతో లాబీయింగ్ చేశారని అన్నారు.