
సాక్షి, నూజివీడు : ప్రత్యేక హోదా సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25మంది ఎంపీలు రాజీనామా చేస్తే హోదాపై దేశవ్యాప్త చర్చ జరిగేదని ఆయన అన్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20న ఒకరోజు దీక్ష చేపడుతున్న విషయం విదితమే.
మరోవైపు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణాజిల్లాలో కొనసాగుతోంది. నూజివీడు నియోజకవర్గంలో శోభనాపురం శివారు నుంచి 140వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతతో కలిసి అడుగులేస్తున్నారు.