హోదా రాకుండా అడ్డుపడింది చంద్రబాబే

YS Jagan Fires On CM Chandrababu In Nuziveedu Sabha - Sakshi

సాక్షి, నూజివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి.. ఆయన నటనకు పద్మభూషణ్‌కు ఏమాత్రం తక్కువకాదని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో లంచాలు కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేల వరకూ, ఎమ్మెల్యేల నుంచి చిన్నబాబు వరకూ, చిన్నబాబు నుంచి పెద్దబాబు వరకూ లంచాలు విస్తరించాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేయాల్సింది చేసి ఇప్పుడేమో దొంగదీక్షలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. అంతేకాక ఒకపూట దీక్ష.. కొంగజపం.. దొంగదీక్ష ఎలా ఉందంటే.. గాంధీని చంపిన గాడ్సే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందని ఆయన ధ్వజమెత్తారు . ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 141వ రోజు శనివారం కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

ట్రిపుల్ ఐటీ సమస్యలు పట్టని బాబు..
పాదయాత్రలో భాగంగా నూజివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ ఐటీని తీసుకొచ్చారు. కృష్ణా జలాలను నూజివీడు తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దే. పేదల కోసం ఐదువేళ్ల ఇళ్ల పట్టాలను కూడా మంజూరు చేశారు. పేదలకు 2వేల ఇళ్లను వైఎస్‌ఆర్‌ ఉచితంగా కట్టించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ట్రిపుల్ ఐటీ సమస్యలను పట్టించుకోవట్లేదు.ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఎనిమిదిమంది ఆత్మహత్యలు చేసుకుంటే వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అంతేకాక ట్రిపుల్ ఐటీని సక్రమంగా నిర్వహించలేకపోయింది. అందుకు చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. నాగార్జున సాగర్‌ నుంచి నూజివీడుకు కేటాయించిన జలాల్లో.. కొన్నేళ్లుగా సగం నీళ్లు కూడా రావడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయాల గురించి ఏ మాత్రం పట్టించుకోవట్లేదు.. ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. మామిడి పంటలకు కూడా గిట్టుబాటుధరలు లేవు.. మామిడి పంటకు గత ఏడాది రూ. 10వేసు వచ్చింది.. కానీ ఈ ఏడాది దిగుబడి తగినా టన్నుకు 18వేలు కూడా రావడం లేదు’

చంద్రబాబు చేసేది ప్రతీది స్కామే..
‘ఇల్లు కడతాం, ప్లాట్లు ఇస్తాం అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోస్తున్నారు. రూ. 3లక్షలు అయ్యే ప్లాట్లను పేదలకు రూ. 6 లక్షలకు అమ్ముతారట. చంద్రబాబు కళ్ల ఎదుటే లక్షల టన్నుల ఇసుక తరలిపోతుంది. కానీ దానిపై చర్యలు తీసుకోవడం లేదు. కలెక్టర్ల నుంచి ఎమ్మెల్యేల వరకు.. ఎమ్మెల్యేల నుంచి చినబాబు వరకు.. చిన్నబాబు నుంచి పెదబాబు వరకు.. ఇసుక నుంచి మట్టి వరకు.. మట్టి నుంచి కాంట్రాక్టర్ల వరకు.. కాంట్రాక్టర్ల నుంచి బోగ్గు వరకు.. బోగ్గు నుంచి కరెంట్‌ వరకు.. కరెంట్‌ నుంచి రాజధాని భూముల వరకు.. రాజధాని భూముల నుంచి గుడి భూముల వరకు లంచాలే లంచాలు. రేషన్ కావాలన్న.. పింఛన్‌ కావాలన్నా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్న లంచాలే లంచాలు తీసుకుంటున్నారు. పైన చంద్రబాబు, కింద జన్మభూమి కమిటీలు లంచాలు మేస్తున్నాయి’.

అందరినీ మోసం చేసిన చంద్రబాబు..
‘చంద్రబాబు రైతులను, పొదుపు సంఘాల అక్కాచెల్లలమ్మలను, నిరుద్యోగులను అందరినీ మోసం చేశారు. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. డ్వాక్రా మహిళలకు ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ నాలుగు సంవత్సరాల పాలనలో మొత్తం నిరుద్యోగులకు చంద్రబాబు రూ. 96వేలు బాకీ పడ్డారు’

చంద్రబాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి..
‘బాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి.. ఆయన నటనకు పద్మభూషణ్‌కు ఏ మాత్రం తక్కువ కాదు. చంద్రబాబు 12 గంటల దీక్షకు రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. ఒకపూట దీక్ష.. కొంగజపం.. దొంగదీక్ష అన్నారు. గాంధీని చంపిన గాడ్సే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలా బాబు దీక్ష ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు కాదా? ప్రత్యేకహోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా? దుగరాజుపట్నం పోర్టు ఇవ్వకపోయిన పర్వాలేదని.. కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు కాదా? పోలవరం ఘోరంగా కనబడటానికి కారణం బాబు కాదా? మా ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేశారు. చంద్రబాబు కూడా తమ 20 మంది ఎంపీల చేత రాజీనామాలు చేయించి.. ఆమరణ దీక్షకు కూర్చబెట్టి ఉంటే.. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేది.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది. ఇప్పుడు ఉన్న 20మంది ఎంపీలతో చంద్రబాబు ఏమీ చేయలేరట. వచ్చే ఎన్నికల్లో 25మందిని గెలిపిస్తే మాత్రం హోదా తీసుకొస్తారట’ అని బాబు తీరుపై వైఎస్ జగన్‌ మండిపడ్డారు. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top