
విలేకరులతో మాట్లాడుతున్న సోమనాథ్ ఖొరా
సాక్షి, కొరాపుట్: కులధ్రువీకరణ పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే రఘురాం పడాల్ అక్రమ మార్గంలో పొందారని బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమనాథ్ ఖొరా ఆరోపించారు. ఇదే విషయమై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో ఆయనకు కులధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారని, అయితే ప్రస్తుతం ఆయనకు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో గతంలో సెమిలిగుడ తహసీల్దార్ కార్యాలయం తిరస్కరించిన కాపీని విలేకరుల ముందు ప్రదర్శించారు. కొరాపుట్ విధానసభ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ను ఆశిస్తున్నందు వల్లే రఘురాం కుల ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించారని పేర్కొన్నారు. ఒకవేళ కొరాపుట్ ఎమ్మెల్యే సీటును ఆయనకు కేటాయిస్తే తాను ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. కొరాపుట్ జిల్లా ఓటరుగా తాను ఆయనను విచారణ చేసేందుకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

కుల ధ్రువీకరణ పత్రం తిరస్కరిస్తున్నట్లు గతంలో చేసిన ఆర్డర్ కాపీ