విలువలే ఊపిరి... విశ్వసనీయతే ఆభరణం
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : విలువలు, విశ్వసనీయతే ప్రామాణికంగా ప్రజాక్షేత్రంలో తమ పార్టీ దినదినాభివృద్ధి చెందుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాల్లో సంతోషం చిగురింపజేయాలన్నదే తమ పార్టీ ధ్యేయమన్నారు.
ప్రజాక్షేత్రమే దేవాలయంగా తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనుక్షణం పోరాడుతున్నారని తెలిపారు. గడచిన ఏడేళ్లుగా పార్టీ చేసిన పోరాటాలు, ప్రజాభిమానం పొందిన తీరును భూమన ఈ సందర్భంగా వివరించారు. అత్యున్నత వ్యక్తిత్వం, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే నైజం, కొండంత ధైర్యం తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆభరణాలని భూమన కొనియాడారు.