కాంగ్రెస్ పార్టీవి చిల్లర రాజకీయాలు: బాల్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఎమ్మెల్యే దివాకర్రావుతో కలసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో జేడీయూకు టీఆర్ఎస్ మద్దతివ్వడంపై కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిహార్ సీఎం నితీశ్కుమార్ అభ్యర్థించడంతో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్కు మద్దతివ్వాలని ఒక్క కాంగ్రెస్ నేత అయినా అడిగారా అని ప్రశ్నించారు. టీడీపీ ముందు, చంద్రబాబు ముందు కాంగ్రెస్ మోకరిల్లిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. బీజేపీతో టీఆర్ఎస్కు స్నేహం లేదని, టీఆర్ఎస్ లౌకిక పార్టీ అని చెప్పారు. ఉద్యమంలో విద్యార్థులను కొట్టించిన కాంగ్రెస్ నేతలు ఓయూకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్గాంధీని ఓయూ కి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదన్నారు. ఓయూ వీసీ అనుమతి ఇవ్వకుంటే టీఆర్ఎస్కు ఏం సంబంధమని ప్రశ్నిం చారు. కేసీఆర్ కుటుంబం ఆదానీ ఆస్తులను మించిపోయిందంటూ రేవంత్ మాట్లాడటం సరికాదని, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఖబడ్దార్ అని రేవంత్ను ఆయన హెచ్చరించారు.