టెక్సాస్ ‘ టాంటెక్స్’ ఆధ్వర్యంలో నౌకావిహారం
టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ‘లూయిస్ విల్’ సరస్సులో ‘లాహిరి, లాహిరిలో.. నౌకావిహారం’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. వనితా వేదిక కమిటీ తరపున శ్రీలక్ష్మీ మండిగ ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమం ఘనంగా కొనసాగింది. టాంటెక్స్ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం అందరికీ స్వాగతం పలకగా.. ‘లూయిస్ విల్’ లేక్ యాజమాన్యం ,టాంటెక్స్ సభ్యులు మహిళలను బోట్లోకి ఆహ్వానించారు. సాయంత్రం 4:30 గంటలకు ‘లాహిరి లాహిరి లాహిరిలో.. అనే పాటతో ప్రయాణం మొదలైంది. బింగో, అంత్యాక్షరీ, డం షరేడేస్, ఆట పాటలతో 4 గంటలు పాటు సరస్సు మధ్యలో విహరించారు. బోటు షికారు సమయంలో.. ఆహూతులకు కావాల్సిన సౌకర్యాలను సంస్థ సభ్యులు అందించారు.
అమెరికాలో ఉన్న తమవారిని చూసేందుకు వచ్చిన భారతీయ తల్లితండ్రులకు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేశారు. టాంటెక్స్ సంస్థకు వారు అభినందనలు తెలిపారు. టాంటెక్స్ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా.. మహిళల కోసం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలను తీసుకొస్తాం. కార్యక్రమం విశేషాలను ప్రసారం చేసిన సీనియర్ జర్నలిస్టు సుందర్ తురుమెల్లకి, ఇతర టీవీ చెనెళ్లకు ధన్యవాదాలు’అన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రుచికరమైన ఫలహారాలను అందించిన బశేరా రెస్టారెంట్కి అభినందనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మీ, కార్యవర్గ సభ్యులు సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, కళ్యాణీ తాడిమేటి, సౌమిత్రి తుపురాని, వసుంధర కాకి, సౌమ్య మాదాల, భారత్ నుంచి వచ్చిన వీరమ్మ మాదాల, శశిరేఖ పట్నాయక్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ఆహూతులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మరిన్ని వార్తలు