మళ్లీ ‘ఇండియా ఈజ్‌ షైనింగ్‌’


న్యూఢిల్లీ: మీడియాతోని మాట్లాడనీయకుండా తోటి మంత్రులను, అధికార యంత్రాంగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియంత్రించిన రోజులు ఉన్నాయి. తాను కూడా మీడియాకు దూరంగా ఉంటూ కేవలం ట్విట్టర్‌ ద్వారానే సమాచారాన్ని ప్రజలతో పంచుకున్న రోజులూ ఉన్నాయి. మంత్రుల నోటి ద్వారా సమాచారం లీక్‌ కాకుండా అరికట్టడం కోసం కూడా పార్టీలో ఓ నిఘా ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేశారు.


పార్టీ అంతర్గత వ్యవహారాలు, కుమ్ములాటలు ప్రజల దష్టికి వెళ్లకుండా నివారించడం కోసం, తనదైనా పంథాను సష్టించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహార శైలిని ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పంథాను, శైలిని పరిశీలిస్తే ఇదొక విఫలప్రయత్నంగానే మిగిలినట్లు మోదీకి అర్థం అయింది. రెండేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ ఒరగబెట్టిందో ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి అర్థంకాని అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది.



ఇలా అయితే లాభం లేదనుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 2004లో అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజపేయి అనుసరించిన ‘ఇండియా ఈజ్‌ షైనింగ్‌’ అనే నినాదాన్ని ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే రెండేళ్ల కేంద్ర పాలనను పురస్కరించుకొని వార్తా పత్రికల్లో, టీవీ ఛానళ్లలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ విజయాలకు సంబంధించి విస్తృత ప్రకటనలు జారీ చేశారు. ఒక్క ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడే కాకుండా తన మంత్రి వర్గంలోని ప్రతి మంత్రి ఏదో పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు.


మీడియా ఇంటర్వ్యూలకు సహజంగా దూరంగా ఉండే తాను సైతం ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదే«శ్‌లోని షహ్రాన్‌పూర్‌లో భారీ స్పీచ్‌ ఇచ్చారు. ఆదివారం నాటి ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగానే తన ప్రభుత్వ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రచార ఆర్భాటం వల్ల అవినీతి రహిత ప్రభుత్వమంటూ ప్రజల ప్రశంసలు దక్కాయి. అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం ఇప్పటికీ అంత ప్రాచుర్యం లభించడం లేదు. ఏదేమైనా 2004 నాటి 'ఇండియా ఈజ్‌ షైనింగ్‌’ అనే నినాదం మాత్రం మళ్లీ తెరపైకి వచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top