
కాంగ్రెస్ గోతులను పూడుస్తాం
అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రస్తుతమున్న వ్యవస్థ మొత్తాన్నీ ప్రక్షాళన చేస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ వర్తక సమ్మేళనంలో మోడీ
వ్యవస్థ మొత్తాన్నీ ప్రక్షాళన చేయాలి..
దేశ వ్యవహారాలన్నీ ఢిల్లీ కేంద్రంగా సాగడం సరికాదు
అధికారంలోకి వచ్చాక పాలనలో రాష్ట్రాలకూ భాగస్వామ్యం కల్పిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రస్తుతమున్న వ్యవస్థ మొత్తాన్నీ ప్రక్షాళన చేస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన గోతులను అధికారంలోకి వచ్చాక పూడుస్తామని భరోసా ఇచ్చారు. వ్యవహారాలన్నీ ఢిల్లీ కేంద్రంగానే సాగడం సరికాదని, దేశ పరిపాలనలో రాష్ట్రాలనూ భాగస్వామి చేయాలన్నారు. అందరినీ దొంగల్లా చూసేలా ఉన్న అనవసరపు చట్టాలన్నింటినీ రద్దు చేస్తామని... దేనికైనా నమ్మకమే ముఖ్యమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సవాళ్ల నుంచి వ్యాపార వర్గాలు పారిపోవద్దని.. వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలూ అందజేస్తామన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) సదస్సులో మోడీ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే...
దేశం ప్రస్తుతం ఆర్థికలోటుతోనే కాదు.. పాలనా లోపం, నమ్మకం లోపం, రక్షణ, నైతిక లోపాలతో సతమతమవుతోంది.
ఢిల్లీలోని యూపీఏ ప్రభుత్వం కంటే.. ఒక మున్సిపాలిటీ చైర్మన్ సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోగలరు.
పనితీరు మెరుగుపర్చడం, లీకేజీలు అరికట్టడం, పారదర్శకత, సాంకేతికంగా అప్గ్రేడ్ చేయడం ద్వా రా ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లోకి వస్తాయి.
రాష్ట్రాలు బలహీనంగా మారాయనే వాదనతో మేం ఏకీభవించబోం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వేరని భావించడం తప్పు.
సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను బలోపేతం చేస్తే దేశ పరిస్థితి చూస్తుండగానే మారిపోతుంది. కానీ, యూపీఏ ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కోతలు పెడుతోంది.
ప్రధాని, కేంద్ర కేబినెట్ను మాత్రమే సంపూర్ణ జట్టుగా భావించవద్దు. ప్రధాని, రాష్ట్రాల సీఎంలే వాస్తవంలో దేశాన్ని నడిపించే నిజమైన జట్లు.
యూపీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలకు నష్టం చేసింది. మేం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థల ప్రతిష్టకు భంగం కలగనీయబోం. వాటి గౌరవాన్ని కాపాడుతాం.
పట్టణీకరణ అవసరమే...
దేశంలో పట్టణీకరణను సంకటంగా కాకుండా అవసరంగా భావించాలి. గ్రామీణ ప్రాంతాల ఆత్మ గ్రామం అయితే, సదుపాయాలు పట్టణాలవి. అయితే, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యచరణ ఉండాలి.
యూపీఏ వ్యవసాయరంగాన్ని విస్మరించింది. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.
దేశం నుంచి ముడి పదార్థాల ఎగుమతులకు స్వస్తి పలకాలి. పత్తి ఉత్పత్తి అయిన చోటే దారం, బట్టలు, రెడీమేడ్ వస్త్రాలు చేస్తే ఉపాధి దొరుకుతుంది.
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తాం..
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు చైనాలో 50 వేలు ఉంటే..భారత్లో 500 కేంద్రాలను ప్రారంభిస్తామని నాలుగేళ్ల కింద ప్రధాని చెప్పారు. అదీ చైనాకు మనకు మధ్య ఉన్న అంతరం.
ఒక వ్యాపారి విదేశాలకు వెళ్తే రూపాయిని డాలర్ల లోకి మార్చి తెస్తాడు. కానీ ఒక టీచరు వెళ్తే ఒక తరాన్ని మారుస్తాడు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వ్యాపారుల ఇబ్బందులను తొలగించడానికి విధి విధానాల్లో మార్పులతో కొత్త చట్టాలను తెస్తాం.
సంక్షిప్తంగా...
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు, బీజేపీ మాజీ ఉపాధ్యక్షురాలు కరుణా శుక్లా (63) గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు.
బీహార్లో అధికార జేడీయూ ఐదుగురు ఎంపీలను గురువారం పార్టీ నుంచి బహిష్కరించింది. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్కుమార్ను విమర్శించిన ఎంపీ శివానంద్ తివారీతోసహా వీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జేడీయూ పేర్కొంది. అయితే వేటుపడినవారిలో ఇద్దరు బీజేపీలో, మరో ఇద్దరు ఆర్జేడీలో చేరనున్నారని సమాచారం.
పార్లమెంటు శీతాకాల సమావేశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ప్రోరోగ్ (నిలిపివేయడం) చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇటీవలి సమావేశాల్లో ఆమోదం పొందని కొన్ని కీలక బిల్లులపై కేంద్రం ఆర్డినెన్స్లు జారీచేసేందుకు వీలు ఏర్పడింది.
సీఐఎస్ఎఫ్ మాజీ డెరైక్టర్ జనరల్ రాజీవ్(60)ను కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కమిషనర్గా రాష్ట్రపతి గురువారం నియమించారు. ఈ పదవిలో రాజీవ్ నాలుగేళ్లు కొనసాగుతారు.