భయపెడుతున్న భారీ వర్షాలు : రెడ్‌ అలర్ట్‌ | Heavy rain hits flights, Mumbai on Red Alert | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న భారీ వర్షాలు : రెడ్‌ అలర్ట్‌

Jul 8 2019 4:09 PM | Updated on Jul 8 2019 4:32 PM

Heavy rain hits flights, Mumbai on Red Alert  - Sakshi

సాక్షి, ముంబై :వాణిజ్య రాజధాని ముంబైని మరోసారి వానలు ముంచెత్తాయి. సోమవారం రోజు కేవలం రెండు గంటలపాటు కురిసిన అతిభారీ వర్షంతోనగర వీధుల్లో వరద పోటెత్తింది.  ఉదయం ఎనిమిదిన్నర గంటలనుంచి 11.30 నిమిషాల వరకు 789 మిల్లీమీటర్ల రికార్డు  వర్షపాతం నమోదైందని స్కైమెట్‌  అంచనా వేసింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ముంబైతో పాటు, పుణే,  తీరప్రాంత కొంకణ్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం నమెదవుతోంది.  తాజా వర్షాల కారణంగా అంధేరీ ఈస్ట్‌లో గోడ కూలిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

రానున్న 24 గంటల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ముఖ్యంగా రాయఘడ్‌, థానే, పాలఘర్‌ ప్రాంతాల్లో రేపు (మంగళవారం) భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  అటు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ అలల తాకిడి ఉంటుందని ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు  అరేబియా సముద్రంలోకి అడుగు పెట్టవద్దని మత్స్యకారులను వాతావరణశాఖ హెచ్చరించింది.

మరోవైపు వాతావరణ అననుకూల పరిస్థితులతో  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో  సేవలను కొద్దిసేపు నిలిపివేశారు. దృశ్యమానత లోపించడంతో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.   కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.  తమ విమానాల రాకపోకల వివరాలను తప్పకుండా  చెక్‌ చేసుకోవాలని ఆయా విమాన సంస్థలు ప్రయాణకులకు విజ్ఞప్తి చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement