ఇది హృదయం లేని ప్రభుత్వం: మాజీ సీఎం | HD Kumaraswamy Slams In CM Yeddyurappa Over Shutdown Santwana centres | Sakshi
Sakshi News home page

ఇది హృదయం లేని ప్రభుత్వం: మాజీ సీఎం

May 16 2020 2:04 PM | Updated on May 16 2020 2:49 PM

HD Kumaraswamy Slams In CM Yeddyurappa Over Shutdown Santwana centres - Sakshi

సాక్షి, బెంగళూరు : గృహహింసతో బాధలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు వసతి సౌకర్యం కల్పించిన సంత్వాన కేంద్రాలను మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం చట్టవిరుద్ధమని జనతాదళ్ సెక్యూలర్‌‌ పార్టీ (జేడీఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోషల్‌ మీడియా వేదికగా విమర్శించారు. దీనిపై ఆయన శనివారం ట్వీట్‌ చేస్తూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంత్వాన కేంద్రాలను మూసివేయాలని ముఖ్యమంత్రి యాడియూరప్ప తీసుకున్న నిర్ణయం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మరో ట్వీట్‌లో ‘‘లాక్‌డౌన్‌లో మహిళలపై దాడుల కేసులు పెరుగుతున్నప్పటికీ.. వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చిన రక్షణ కేంద్రాలను రద్దు చేయబోతున్నారు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. (కుమార కాషాయ రాగం)

ఇక ‘‘రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.. కానీ గృహ హింస బాధిత మహిళలను సంరక్షించిన సంత్వాన కేంద్రాలు మూసివేయబడుతున్నాయి’’ అని వరుస ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. ‘‘ఓ వైపు పురుషుల చేతికి మద్యం సిసాలు అందిస్తూ.. మరోవైపు బాధిత మహిళలకు రక్షణ కల్పించే కేంద్రాలను మూసివేస్తానడం విడ్డూరంగా ఉంది’’ అన్నారు. ‘‘రెండు దశాబ్ధాలుగా గృహహింసతో తీవ్ర ఒత్తిడికి గురైన రాష్ట్ర స్థాయి మహిళలకు సహాయం అందించడంమే కాకుండా.. జిల్లా స్థాయిలోని మహిళలు, పిల్లలకు సంరక్షణ ఇవ్వడంలో సంత్వాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి రక్షణ కేంద్రాలను ఖచ్చితంగా హృదయం లేని ప్రభుత్వమే మూసివేస్తుంది’’ అంటూ ఆయన విమర్శించారు.   

Advertisement
 
Advertisement
Advertisement