
బదిలీ వేటు పొంచి ఉందన్న జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్
జమ్మూ : కేంద్ర ప్రభుత్వం తనపై బదిలీ వేటు వేయవచ్చని జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజద్ లోన్ను కోరుకుంటోందని తాను వ్యాఖ్యలు చేసినందున కేంద్రం తనను కశ్మీర్ నుంచి తప్పించవచ్చని అంచనా వేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత గిరిధరి లాల్ దోగ్రా వర్ధంతిలో పాల్గొన్న మాలిక్ ‘నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానన్నది నా చేతుల్లో లేదు..ఉన్నంత వరకూ ఉంటా..బదిలీ ముప్పు మాత్రం పొంచి ఉంద’ని వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడు బదిలీ చేస్తారో తనకు తెలియదని, తాను కశ్మీర్లో ఉన్నంతవరకూ మీరు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు.
జమ్ము కశ్మీర్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో తాను కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచిచూస్తానని ఈనెల 24న మాలిక్ గ్వాలియర్లో బాహాటంగా అంగీకరించారు. బీజేపీని బలపరిచే సజద్ లోన్ను తాను సీఎంగా ప్రతిష్టించాలని, కానీ తాను ఆ పని చేయనని స్పష్టం చేశారు. అయితే గవర్నర్ వ్యాఖ్యలను వక్రీకరించారని, కేంద్రం నుంచి ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం లేదని మీడియానే గవర్నర్ ప్రకటనను వక్రీకరించిందని రాజ్భవన్ ఆ తర్వాత ఓ ప్రకటనను జారీ చేసింది. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్లు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతున్న క్రమంలో గవర్నర్ ఈనెల 21న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేశారు.