పాక్‌కు చైనా కూడా షాకిచ్చింది!

China snubs Pakistan, tell it to resolve issues peacefully - Sakshi

బీజింగ్‌: జమ్మూకశ్మీర్‌ విషయంలో మద్దతు కోసం కోటి ఆశలతో చైనాను ఆశ్రయించిన దాయాది పాకిస్థాన్‌కు ఒకింత చుక్కెదురైంది. కశ్మీర్‌ విషయంలో దుందుడుకు వైఖరి అవలంబిస్తున్న పాక్‌కు చైనా షాక్‌ ఇచ్చింది. పొరుగున ఉన్న భారత్‌-పాకిస్థాన్‌ రెండు కూడా తమ మిత్రదేశాలని చైనా తేల్చిచెప్పింది. కశ్మీర్‌ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోవాలని, ఐక్యరాజ్యమితి తీర్మానం, షిమ్లా ఒప్పందం ఆధారంగా ఈ అంశంపై పరిష్కారానికి రావాలని దాయాదికి సూచించింది.

ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో చైనా మద్దతు కోరుతూ పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ హుటాహుటిన ఆ దేశం వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో భేటీ అయ్యారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ చర్యలను తప్పుబడుతూ పాక్‌ ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది. భారత్‌తో దౌత్యసంబంధాలను తగ్గిస్తూ దాయాది పలు దుందుడుకు నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాలని పాక్‌ భావిస్తున్నప్పటికీ.. ఆ దేశానికి శాశ్వత మిత్రపక్షంగా చైనా మాత్రం ఆచితూచి స్పందిస్తూ.. భారత్‌ వైఖరికి అనుగుణంగా వ్యాఖ్యలు చేసింది. షిమ్లా ఒప్పందం ఆధారంగా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని భారత్‌ వాదిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top