వణికిన చెన్నై
సాక్షి,చెన్నై: భారీ వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై సహా పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కుండపోతతో చెన్నైలో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులూ జలమయమయ్యాయి. చెన్నై నగరంలోని జీఎస్టీ రోడ్, అన్నాసలై సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలకు తంజావూర్ జిల్లాలో ఓ వ్యక్తి మరణించారు.
రానున్న 24 గంటల్లో చెన్నై నగరంతో పాటు పరిసర ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ర్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేసింది.