మరోసారి బుల్లితెరపై సల్మాన్‌...

Salman Khan Hosting For Dus ka Dum Show - Sakshi

రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తాజాగా మరో కార్యక్రమం ద్వారా బుల్లితెరపై మెరవబోతున్నారు. విజయవంతమైన ‘దస్‌ కా దమ్‌’ మూడో సిరీస్‌కు సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ప్రోమోను ఈ కండల వీరుడు తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఇలాంటి టీవీ షోలను ఆసక్తికరంగా నడిపించడంలో ఈ ‘దబాంగ్‌’ హీరోకు మంచి ప్రావీణ్యం ఉందనే చెప్పవచ్చు. తన ఆసక్తికర వాఖ్యలతో ప్రేక్షకులను కట్టిపడేయడం సల్మాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. 20 వారాలపాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికిగాను సల్మాన్‌ 78కోట్ల రూపాయలు తీసుకోనున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జూన్‌ నుంచి ‘దస్‌ కా దమ్‌’ కార్యక్రమం ప్రారంభంకానున్నట్లు సమాచారం. 

ఈ సారి ‘దస్‌ కా దమ్‌’ కార్యక్రమంలో సామాన్యులతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు టీవీ నటులు కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో నేషనల్‌ సర్వేకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. సమాధానాలను శాతాలలో (పర్సంటేజ్‌) చెప్పాల్సి ఉంటుంది. సరైన లేదా సమీప సమాధానం చెప్పినవారు 10 వేల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ గెలుచుకుంటారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top