సవాళ్లను ఎదుర్కొన్నా!

Rakul Preet Singh Shared Her Struggled Days In Movie Industry - Sakshi

తమిళ సినిమా: నేనీ స్థాయికి ఎదగడానికి చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను అని చెప్పింది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. మొదట నటిగా రాణించాలని కోలీవుడ్‌నే ఎంచుకున్న ఈ ఉత్తరాది బ్యూటీని కోలీవుడ్‌ గుర్తించలేదు. మరు ప్రయత్నంగా టాలీవుడ్‌ను ఆశ్రయించింది. అక్కడ అమ్మడికి టైమ్‌ కలిసొచ్చింది. యువ హీరోలతో మొదలెట్టి, స్టార్‌ హీరోలతో రొమాన్స్‌ చేసే స్థాయికి ఎదిగింది. అయితే అక్కడ ఎక్కువ కాలం రాణించలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లోనే అవకాశాలు ఉన్నాయి. కార్తీతో జత కట్టిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం రకుల్‌ప్రీత్‌సింగ్‌ నోట్లో పాలు పోసింది. తాజాగా సూర్యతో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఎన్‌జీకే చిత్రంలో నటిస్తున్న ఈ జాణ మరోసారి కార్తీతో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం వరించింది. ఇక హిందీలో అజయ్‌దేవగన్‌తో నటించిన అయ్యారే చిత్రం ఈ ముద్దుగుమ్మ ఆశలకు గండికొట్టింది. తాజాగా అక్కడ మరో చిత్రంలో నటిస్తోంది.

ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ తన సినీ అనుభవాలను వ్యక్తం చేస్తూ సినిమాలో తనకు ఏదీ సులభంగా లభించలేదంది. నటిగా తొలి అవకాశాన్ని, విజయాన్ని కష్టపడే పొందానని చెప్పింది. అయితే అదే సినిమా తనకు చాలానే నేర్పించిందని పేర్కొంది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నానని తెలిపింది. హిందీ, కన్నడ భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయని అంది. తనకు ఖాళీగా కూర్చోవడం అసలు ఇష్టముండదని చెప్పింది. తనకు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉందని అంది. మొదట్లో జీవితం తలకిందులుగా మారిందని, అప్పుడే సవాళ్లను ధైర్యంగా ఎదురొడ్డి ఈ స్థాయికి ఎదిగానని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆ మధ్య 10 నెలల్లో మూడు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయామని, అయినా నిరాశతో కుంగిపోయి బాధ పడుతూ కూర్చోకుండా పట్టుదలతో శ్రమించి నటిగా రాణిస్తున్నానని పేర్కొంది. ఎవరైనా సవాళ్లను ఎదురొడ్డి పోరాడితేనే జీవితంలో విజయాలను సాధించగలరని రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top