కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) గుర్తించిన సినీ కార్మికులకు అన్ని అపోలో ఫార్మసీ స్టోర్స్లో ఉచిత మందులు అందజేయాలని ఉపాసన తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ఉపాసనది చాలా మంచి మనసు అని కొనియాడారు. మరోవైపు కరోనాపై ప్రజల్లో అవగాహన కలిగించేలా చిరంజీవి కూడా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం సినిమా షూటింగ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి సి. సి. సి. మనకోసం (కరోనా క్రై సిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేశారు. దీనికి చిరంజీవి చైర్మన్గా ఉండగా.. సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, సీ కల్యాణ్, దాము సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే సీసీసీ పలువురు సినీ ప్రముఖలు భారీగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.