
అందరూ పవన్ కల్యాణ్ని అనుకరిస్తున్నారు.. బన్నీ స్టయిల్ సెపరేట్
‘‘అల్లు రామలింగయ్యగారంటే నాకెంతో అభిమానం. నా చేతుల మీదగా ప్రారంభమైన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థకు రెండు ఘనవిజయాలు ఇచ్చాను.
- : డా. దాసరి నారాయణరావు
‘‘అల్లు రామలింగయ్యగారంటే నాకెంతో అభిమానం. నా చేతుల మీదగా ప్రారంభమైన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థకు రెండు ఘనవిజయాలు ఇచ్చాను. అల్లు అర్జున్ ఇవాళ ఎవరూ ఊహించని స్థాయిలో నిలబడ్డాడు. మామూలుగా ఏ హీరోకైనా ఓ శైలి ఉంటుంది. ఎన్టీఆర్దో శైలి. ఏయన్నార్దో శైలి. పవన్ కల్యాణ్ది ఓ ప్రత్యేకమైన శైలి. అతని శైలిని హీరోలందరూ అనుకరించడానికి ప్రయత్నిస్తుంటే అల్లు అర్జున్ మాత్రం వేరొక స్టయిల్లో దూసుకెళుతున్నాడు. బన్నీని చాలామంది హీరోలు కాపీ కొడుతున్నారు’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. అల్లు అర్జున్, సమంత, అదా శర్మ, నిత్యామీనన్ కాంబినేషన్లో ఎస్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. డా. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు చేశారు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి సీడీని ఆవిష్కరించి అల్లు అరవింద్కి ఇచ్చారు. దాసరి ఇంకా మాట్లాడుతూ - ‘‘ ‘అత్తారింటికి దారేది’ విజయం తర్వాత త్రివిక్రమ్, ‘రేసు గుర్రం’ విజయం తర్వాత అల్లు అర్జున్ చేసిన ఈ చిత్రం ఆ రెండు చిత్రాలకు దీటుగా ఉంటుందనిపిస్తోంది. ప్రచార చిత్రాలు, పాటలు బాగున్నాయి’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ‘జులాయి’ తర్వాత మళ్లీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.
‘జులాయి’ సినిమా కన్నా పెద్ద హిట్ అవ్వాలన్న భయం, భక్తులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా చేశారు. మాతో కూడా అలా నటింపజేశారు. ఆ సినిమా కన్నా నాలుగింతలు బాగుంటుందీ సినిమా. నా డార్లింగ్ అల్లు అర్జున్తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ఇది కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుందని త్రివిక్రమ్ అన్నారు. విచ్చేసిన అతిథులకు, అభిమానులకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మానందం, అలీ, ఉపేంద్ర, దేవిశ్రీ ప్రసాద్, సమంత, అదా శర్మ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.