
నటి ఐశ్వర్యరాయ్ తండ్రి మృతి
బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ కుటుంబంలో విషాదం నెలకొంది.
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి క్రిష్ణరాజ్ రాయ్ శనివారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఐశ్వర్య సన్నిహితులు జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి క్రిష్ణరాజ్ రాయ్ కేన్సర్ సమస్యలతో సతమతవుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకున్నట్లు కనిపించినా పూర్తిస్థాయిలో చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు. ఈ క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
కొన్ని రోజుల కిందట తండ్రి అనారోగ్యం విషయాన్ని తెలుసుకున్న ఐశ్వర్యరాయ్ తన దుబాయ్ పర్యటనను రద్దు చేసుకుని.. ముంబైకి వచ్చి అక్కడే ఆస్పత్రిలో ఉంటూ తండ్రికి సేవలు చేశారు. న్యూయార్క్ లో ఉన్న ఐశ్వర్య భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ముంబైకి తిరిగొచ్చేసిన విషయం తెలిసిందే. క్రిష్ణరాజ్ రాయ్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో అమితాబ్ బచ్చన్ దంపతులు పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి ఐశ్వర్య తల్లి వృందారాయ్, సోదరుడు ఆదిత్యా రాయ్ ని కలిసొచ్చారు. అమితాబ్ శనివారం మరోసారి ఆస్పత్రికి వెళ్లి కోడలు ఐశ్వర్యను పరామర్శించినట్లు సమాచారం.