సాగుకు ‘పవర్‌’ ఫుల్‌ | 24 hour power supply to farm sector | Sakshi
Sakshi News home page

సాగుకు ‘పవర్‌’ ఫుల్‌

Published Mon, Jan 1 2018 4:20 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్‌: జిల్లాలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరాను ఆదివారం అర్ధరాత్రి నుంచి అధికారులు ప్రారంభించారు. గత నంవబర్‌లో ట్రయల్‌రన్‌ నిర్వహించిన అధికారులు 24 గంటల కరెంటు సరఫరా సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. డిసెంబర్‌ 28వ తేదీ నుంచి ట్రయల్‌ నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి  కోతలు లేకుండా సరఫరా చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ రంగ విద్యుత్‌ కనెక్షన్లు 33,559 ఉన్నాయి. ప్రస్తుతం 20 నుంచి 25 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉం టుందని అధికారులు పే ర్కొంటున్నారు. ప్రస్తుతం జి ల్లాలో యాసంగి సాగు ప్రా రంభమైన నేపథ్యంలో నిరంతర కరెంటు సరఫరా ఎంతో ఉపయోగమని రైతులు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ పంట దిగుబడులు ఆలస్యమైనందున యాసంగిలో నారు పోసుకున్నవారు వరినాట్లకు సిద్ధమవుతున్నారు. విద్యుత్‌ మోటార్ల ద్వారా పొలాల్లో నీరు పారిస్తున్నారు. జిల్లాలో గత  ఏడాది 18 వేల హెక్టార్లలో యాసంగి సాగు కాగా ఈ ఏడాది 19 వేల వరకు ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 24 గంటల కరెంటు సరఫరాతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. డిసెంబర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి జిల్లాలో 5300 ఆటోస్టార్టర్లను అధికారులు తొలింగించారు. 

యాసంగిలో ఎంతో మేలు
జిల్లాలో యాసంగి సీజన్‌ డిసెంబర్‌ నుంచి మార్చి మొదటి వారం వరకు విద్యుత్‌ మోటార్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు నెలల సమయంలో 22 నుంచి 25 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 24 గంటల విద్యుత్‌తో ఈ సీజన్లో రైతులు ఎక్కువగా వరి, కూరగాయల పంటలే అధికంగా సాగు చేసుకోనున్నారు. వరి పంట దిగుబడి వచ్చేవరకు నీరు అవసరం ఉంటుంది. ఎక్కువగా లక్సెట్టిపేట, చెన్నూర్‌ విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోనే విద్యుత్‌ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతం ఉండడంతో మోటార్ల ద్వారా వరి సాగు ఎక్కువగా చేస్తున్నారు. మంచిర్యాల సబ్‌డివిజన్, బెల్లంపలి డివిజన్‌ పరిధిలో బోర్‌మోటార్ల ద్వారా వరి సాగుతోపాటు ఇతర కూరగాయల సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో కంటే ఇటీవల విద్యుత్‌ కనెక్షన్లు రెట్టింపు అయ్యాయి. గత ఏడాది భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో గత ఏడాది వరి ఊహించిన దానికంటే ఎక్కువగా సాగైంది. 1.45 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరి సాగు, దిగుబడి వచ్చింది. ఈ ఏడాది భూగర్భ జలాలు అనుకులంగా ఉండడంతోపాటు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయనుండంతో రైతులు సాగు విస్తీర్ణం మరింత పెంచే అవకాశం ఉంది. దీంతో విద్యుత్‌ వినియోగం గత ఏడాది కంటే రెండింతలు పెరిగే అవకాశం ఉంది.

పగటి పూట 12 గంటలు ఇచ్చినా చాలు
యాసంగిలో మూడెకరాల్లో వరి సాగు చేసుకుంటున్నాను. కరెంటు కోతలు లేకుండా ఇస్తున్నారు. పంటకు నీటితడులు పెట్టేందుకు పగటి పూట 12 గంటల కరెంటు సరిపోతుంది. పొలం బీడు పోకుండా రెండు పంటలు తీసుకునేందుకు కరెంటు సరఫరా ఎంతో మేలు జరుగుతుంది.
– కొట్టే సతీష్, నర్సింగపూర్, హాజీపూర్‌

జిల్లాలో సబ్‌డివిజన్ల వారీగా విద్యుత్‌ కనెక్షన్లు
సబ్‌డివిజన్‌                    కనెక్షన్లు 
మంచిర్యాల                       3,435                
చెన్నూర్‌                          0,377        
లక్సెట్టిపేట                       16,529            
బెల్లంపల్లి (డివిజన్‌)            3,218                
మొత్తం                           33,559 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement