‘కరోనాపై అతిగా భయపడకండి’
గ్రోంజీ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్పై చెచన్యా నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెడ్లీ వైరస్ గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మనిషి ఏదో ఒకరోజు మరణించాల్సిందేనని ఆ దేశ నేత రందాన్ కదిరోవ్ అన్నారు. ప్రజలు తమ చేతుల్లో లేని దాని గురించి బాధపడరాదని, సంప్రదాయ వైద్య చిట్కాలను విడిచిపెట్టరాదని సూచించారు. చైనా నుంచి వ్యాప్తి చెందిన వైరస్పై ఆందోళనతో ప్రజలకు కంటిమీద కునుకు లేదని, అది తమకు సోకి తాము మరణిస్తామని ప్రజలు ఆందోళన చెందుతున్నారని స్ధానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.
వ్యాధి గురించి భయపడాల్సిన పనిలేదని..మీరు ఎప్పుడైనా మరణిస్తారు..మీ సమయం రాకముందే మరణించాలని ప్రయత్నిండం మానండని హితవు పలికారు. ముస్లిం మెజారిటీ రిపబ్లిక్ చెచెన్యా అధినేతగా దీర్ఘకాలం వ్యవహరించిన కదిరోవ్ కరోనాపై అతిగా ఆలోచించి అనవసర భయాలకు లోనుకావద్దని సూచించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలని, వెల్లుల్లి అధికంగా వాడాలని చెప్పుకొచ్చారు. ఇక 13 లక్షల జనాభా కలిగిన చెచెన్యాలో డెడ్లీ వైరస్కు సంబంధించి ఇప్పటివరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు.