
పరిశోధనల్లో మేటి.. సెంట్రల్ వర్సిటీ
‘వర్సిటీలు విద్యార్థులను తయారు చేసే కార్ఖానాలు కాదు.. దేశ కీర్తిని చాటే ప్రగతి కిరణాలు’ అని ఓ రచయిత చెప్పిన
17 అంశాలకు పేటెంట్లు..
త్వరలో మరికొన్నింటికి..
వందల కోట్ల నిధులతో కొత్త పరిశోధనలు
సెంట్రల్ యూనివర్సిటీ: ‘వర్సిటీలు విద్యార్థులను తయారు చేసే కార్ఖానాలు కాదు.. దేశ కీర్తిని చాటే ప్రగతి కిరణాలు’ అని ఓ రచయిత చెప్పిన ఈ మాట అక్షరాలా నిజం చేస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక కేంద్రీయ విశ్వ విద్యాలయమైన హెచ్సీయూ పరిశోధనల్లో సత్తా చాటుతోంది. హెచ్సీయూలో చేపట్టిన 42 పరిశోధనా అంశాలపై దరఖాస్తు చేయగా ఇప్పటికి 17 పేటెంట్లు లభించాయి. వీటిలో 12 విదేశీ, ఐదు స్వదేశీ పేటెంట్లు కావడం గమనార్హం. వీటిలో అమెరికా, యూరోప్, కెనడా వంటి దేశాలు కూడా ఉన్నాయంటే వర్సిటీ ప్రగతి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధికంగా పేటెంట్లు దక్కాయి. హెచ్సీయూలో ప్రస్తుతం రూ. 230 కోట్ల విలువ చేసే 240 ప్రాజెక్టులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ యూనివర్సిటీ పరిశోధనల్లో చేస్తున్న కృషికి గాను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్) సంస్థ అంతర్జాతీయ ఉత్తమ పరిశోధనా సంస్థ గౌరవాన్ని ఇచ్చింది.
పేటెంట్లు పొందిన ప్రొఫెసర్లు వీరే..
సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేపడుతున్న పరిశోధనలకు కేంద్ర జీవ సాంకేతిక విభాగం, డీఎస్టీ, కేంద్ర ప్రభుత్వం, హెచ్సీయూ ఆర్థిక సహకారం అందించాయి. పొందిన 17 పేటెంట్లలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అశ్విని నాంగియాకు 5, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ ఎ.కె. కొండపికి మూడు దక్కాయి. కెమిస్ట్రీ ప్రొఫెసర్ టి.పి. రాధాకృష్ణన్, ఫిజిక్స్ ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ విశ్వనాథన్ రెండేసి పేటెంట్లు పొందారు. లైఫ్ సైన్స్ ప్రొఫెసర్లు పి.రెడ్డన్న, దయానంద, ఫిజిక్స్ ప్రొఫెసర్లు ఎస్. దత్తగుప్త, ఘనశ్యాం కృష్ణ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సెన్సైస్ ప్రొఫెసర్లు కె.ఎ. పద్మనాభన్ ఒక్కో పేటెంట్ను సాధించారు. మరి కొన్ని పరిశోధనలకు పేటెంట్లు రావాల్సి ఉంది. పరిశోధనల్లో ప్రత్యేకత చాటుతున్న ఈ వర్సిటీకి తాజాగా రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
కంపెనీల సాయం నిల్
కొత్తగా చేపట్టే పరిశోధనలకు సాయం అందించేందుకు భారతీయ కంపెనీలు ముందుకు రావడంలేదు. ముఖ్యంగా ఔషధ పరిశోధనల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. సరైన నిధులు, ప్రోత్సాహం ఉంటే దేశ ప్రతిష్టతను చాటే నూతన ఆవిష్కరణలను హెచ్సీయూ నుంచి అందించగలం. - ప్రొఫెసర్ ఆనంద్ కె. కొండపి, (బయోటెక్నాలజీ విభాగం)
కేంద్రం సహకరిస్తే..
హెచ్సీయూలో పరిశోధక వాతావరణం, ప్రోత్సాహం బాగా ఉంటుంది. విదేశాలకు దీటుగా భారత్ను నిలపాలంటే యూనివర్సిటీలు నిరంతర పరిశోధనలు చేపట్టాలి. విద్యార్థులకు పరిశోధనలపై ప్రోత్సాహం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరికొన్ని పేటెంట్లు సాధిస్తాం.
- ప్రొఫెసర్ అశ్విని నాంగియా, ఫిజిక్స్ విభాగం