ప్రజల్లోకి ఉద్యమ పతాకం | rest of my life with public,says kodandaram | Sakshi
Sakshi News home page

ప్రజల్లోకి ఉద్యమ పతాకం

Sep 29 2015 3:05 AM | Updated on Sep 3 2017 10:08 AM

ప్రజల్లోకి ఉద్యమ పతాకం

ప్రజల్లోకి ఉద్యమ పతాకం

సుమారు మూడున్నర దశాబ్దాల పాటు ఉస్మానియాలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించిన కోదండరామ్ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

- ఈనెల 30న ప్రొఫెసర్‌గా రిటైర్ కానున్న కోదండరామ్
- 1981లో లెక్చరర్‌గా ప్రస్థానం
- తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం
- రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఉద్యమానికి దిశా నిర్దేశం
- రాష్ట్ర ఏర్పాటు అనంతరం తిరిగి ‘పాఠాల’కే పరిమితం
- ఇక ముందు పూర్తి సమయం ప్రజల కోసమే..
 
 పుట్టిన తేదీ: 5 సెప్టెంబర్ 1955
 స్వస్థలం: కరీంనగర్ జిల్లా ఊటూరు
 తల్లిదండ్రులు: వెంకటమ్మ, జనార్ధన్‌రెడ్డి
 చదువు: ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ
 హోదా: లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా (1981 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకు)
 భార్య: సుశీల, గృహిణి
 పిల్లలు : ఒక కుమార్తె, ఒక కుమారుడు
 
సాక్షి, హైదరాబాద్:
ఉక్కుపాదాల మహారక్కసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ తరం ఉప్పెనై ఎగిసింది.. ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉద్యమించింది. ఆ ఉద్యమాల బాటలోనే తొలి అడుగులు వేశారు ప్రొఫెసర్ కోదండరామ్. రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టాక పాఠాలు-పోరాటాలు జీవితంలో భాగమయ్యాయి. పౌర హక్కుల ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఒక ఉత్తేజకరమైన, స్ఫూర్తిదాయకమైన ఉద్యమ పథం ఆయనది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు ఉస్మానియాలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించిన కోదండరామ్ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌గా కోట్లాది మంది తెలంగాణ ప్రజల  హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్న ఆయన... ఆ ప్రజల కోసం చేయవలసిన పని ఇంకా ఎంతో ఉందని చెప్పారు. ఇక పూర్తి కాలం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేసే అవకాశం లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.

లెక్చరర్‌గా ప్రారంభమైన ప్రస్థానం
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరులో కోదండరామ్ జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో స్థిరపడింది. కోదండరామ్ విద్యాభ్యాసం మాత్రం వరంగల్‌లో సాగింది. డిగ్రీ వరకు అక్కడ చదివిన ఆయన... ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఢిల్లీ జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తిచేశారు. 1981 జూన్ 16న నిజాం కళాశాలలో రాజనీతి శాస్త్రం లెక్చరర్‌గా చేరారు. తర్వాత 1987 నుంచి 1997 వరకు కోఠిలోని ఉమెన్స్ కాలేజీలో, 2000 సంవత్సరం వరకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో బోధించారు. 1996లోనే రీడర్‌గా పదోన్నతి పొందారు.

2000 సంవత్సరం నుంచి 2007 వరకు తిరిగి నిజాం కళాశాలలో పనిచేశారు. ఈ సమయంలో 1950-1990 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై కోదండరామ్ పరిశోధన చేశారు. 2004లోనే ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2007 నుంచి ఇప్పటివరకు ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాలు, సమకాలీన అంశాలు, సామాజిక ఉద్యమాలు వంటివి ఆయన బోధనాంశాలు. ఒకవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే... మరోవైపు హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 1981లో పౌర హక్కుల ఉద్యమంలో చేరింది మొదలు 1999లో మానవ హక్కుల వేదిక వరకు పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు కృషి చేశారు. ‘స్వేచ్ఛ’ పత్రిక సంపాదకులుగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమంలో..
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, వ్యక్తీకరణలన్నింటిలోనూ కోదండరామ్‌కు పాత్ర ఉంది. ‘‘ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫోరమ్ ఆధ్వర్యంలో లోతైన చర్చలు, సభలు, సదస్సులు జరిగేవి. 1996లో నవంబర్ 1వ తేదీని విద్రోహదినంగా పాటిస్తూ జరిపిన సభ ఒక విస్ఫోటనం. భారీ సంఖ్యలో ప్రజలు ఆ మీటింగ్‌కు వచ్చారు. 1997 నుంచి తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ ఉద్యమవ్యాప్తికి దోహదం చేశాయి. 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భవించింది. దాంతో ఒక విస్తృతమైన కార్యాచరణ ఏర్పడింది. గిర్‌గ్లానీ కమిటీ నివేదికను వెలుగులోకి తేవడంతో పాటు దాని అమలు కోసం వేదిక పోరాటం చేపట్టింది. పోలవరంపైన సదస్సులు నిర్వహించింది. ప్రజల్లో తెలంగాణ భావవ్యాప్తికి, ఉద్యమ విస్తృతికి కృషి చేశాం. 2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాం..’’ అంటూ తన తెలంగాణ పోరాట క్రమాన్ని కోదండరామ్ గుర్తుచేసుకున్నారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్ర ఆవిర్భావం వరకు కోదండరామ్ కేంద్ర బిందువుగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తిరిగి పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా మారిపోయారు. ‘‘ఉద్యమ క్రమంలో చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ 2010 వరకు కాలేజీకి వెళ్లాను. పాఠాలు చెప్పాను. 2011 నుంచి సెలవు పెట్టవలసి వచ్చింది. రాష్ర్ట ఆవిర్భావం తరువాత తిరిగి కాలేజీకి వెళ్తున్నాను..’’ అని ఆయన చెప్పారు.
 
భవిష్యత్తు గురించి..
రిటైర్ కాబోతున్న నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ గురించి కోదండరామ్ వివరించారు. ‘‘పాఠాలు చెప్పడం తప్పించి మిగతా పని కొనసాగుతుంది. పూర్తికాలం ప్రజల కోసమే పనిచేస్తాను. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి జరగాల్సి ఉంది. ఆత్మహత్యలకు, ఆకలి చావులకు తావులేకుండా రాష్ట్రంలో రైతుల వ్యవసాయం సాగాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజా వైద్యం ఎంతో మెరుగుపడాల్సి ఉంది. అలాగే విద్యారంగం కూడా. ఈ మూడు ప్రధాన రంగాల్లో ఆయా వర్గాల ప్రజలతో, సంఘాలతో కలసి చేయవలసిన పని చాలా ఉంది..’’ అని  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement