
ఒకటి ‘పోతే’.. పదిహేను..
బిహార్లోని గయ ఫారెస్ట్ డివిజన్ను ఏనుగులు హడలెత్తిస్తున్నాయి.
గయలోకి ప్రవేశించిన ఏనుగుల మంద
గ్రామాలపై దాడి.. నలుగురిని చంపిన గజాలు
మరో ఆపరేషన్లో సిటీ హంటర్ నవాబ్
సిటీబ్యూరో : బిహార్లోని గయ ఫారెస్ట్ డివిజన్ను ఏనుగులు హడలెత్తిస్తున్నాయి. పది రోజుల క్రితం ముగ్గురిని తొక్కి చంపిన భారీ ఏనుగును హతమార్చిన వారం రోజుల్లోనే మరో 15 మత్తగజాలు దాడికి దిగాయి. దీంతో మరోసారి అక్కడి ప్రభుత్వం సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్కు కబురు పెట్టింది. ఆదివారం అక్కడకు చేరుకున్న ఆయన ఏనుగులను జనావాసాల నుంచి దూరంగా తరిమేసేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలను అలీ ఖాన్ గురువారం ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు.
అడవిలో తిండి దొరక్క..
నేపాల్ అటవీ ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. శీతాకాలం అక్కడి అడవుల్లో చెట్లకు ఉండే ఆకులు పూర్తిగా రాలిపోతాయి. ఆహారం దొరక్క ఏనుగులు బిహార్లోకి వచ్చి పడుతున్నాయి. గత శుక్రవారం నాలుగు పిల్లలు, రెండు మగ ఏనుగులు, తొమ్మిది ఆడ ఏనుగులతో కూడిన మంద బీహార్లోని జనావాసాల్లోకి చొరబడ్డాయి. గయ, ఔరంగాబాద్ జిల్లాలోని అడవి వెంట ఉన్న నదీ పరీవాహక ప్రాంతంలో తిరుగుతూ.. పంటలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. పిల్లలున్న మందకు సాధారణంగా ఆడ ఏనుగు నేతృత్వం వహిస్తుంది. తన పిల్లల్ని రక్షించుకునే ప్రయత్నంలో కనిపించిన మనుషులపై దాడి చేసి హతమారుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల్లో రెండు జిల్లాల్లోనూ నలుగురిని చంపేశాయి.
వాసన పసిగట్టడంలో దిట్టలు..
సాధారణంగా ఏనుగులకు వాసన పసిగట్టే స్వభావం చాలా ఎక్కువ. నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి మనిషి వాసన గుర్తించి.. జారుకోవడమో, మాటు వేసి దాడి చేయడమో చేస్తాయి. ఈ నేపథ్యంలోనే హంటర్ నవాబ్ తన బృందంతో గాలివాటానికి వ్యతిరేక దిశలో ‘వేట’ కొనసాగిస్తున్నారు. గజాలకు కంటి చూపు తక్కువగా ఉంటుంది. దీన్ని ద ృష్టిలో అలీ ఖాన్ సహా ఆయన బృందంలోని అందరూ తేలిక రంగు దుస్తులు ధరించి ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఈ ఏనుగుల మంద జనావాసాల్లోకి వచ్చామనే టెన్షన్లో తమను తాము రక్షించుకోవడానికి దాడులకు దిగుతున్నాయి. మరోపక్క వీటిని ఎదుర్కోవడానికి పశ్చిమ బెంగాల్ నుంచి నిపుణుల్ని రప్పించారు.
అలా ముందుకు.. ఇలా వెనక్కు..
బీహార్ ప్రభుత్వ విజ్ఞప్తితో పాటు పరిస్థితులను అంచనా వేసిన అలీ ఖాన్.. ఏనుగుల మందను తరిమేయడం పైనే దృష్టిపెట్టారు. టపాసులు, కాగడాలు వినియోగించి సాయంత్రానికి మందను అడవుల వైపు తరిమేస్తున్నారు. ఇలా ఒక రోజులో రాత్రి వరకు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఆపరేషన్ సాగుతోంది. రాత్రికి ఆపరేషన్ ఆగడంతో పాటు అలీ ఖాన్ బృందం ఏనుగులు ఉన్న ప్రాంతం నుంచి కాస్త దూరంగా సురక్షిత ప్రాంతానికి చేరుతోంది. దీంతో ఏనుగుల మంద తెల్లవారేసరికి మళ్లీ వెనుక్కు వచ్చేస్తోంది. మరుసటి రోజు ఆపరేషన్ మళ్లీ మొదటికి వస్తోంది. ఈ నేపథ్యంలో షఫత్ అలీ ఖాన్ బృందం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
తృటిలో తప్పిన ముప్పు..
ఆపరేషన్ ప్రారంభించిన అలీ ఖాన్ ఆ ఏనుగుల మందను పరిశీలిచండానికి బిహార్ అటవీ శాఖ సిబ్బందితో కలిసి అవి ఉన్న పొలాల్లోకి వెళ్లారు. వీరి రాకను గమనించిన ఓ ఆడ ఏనుగు దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన అలీ ఖాన్ తన రైఫిల్తో గాల్లోకి కాల్పులు జరిపి దాన్ని తరిమేశారు. ‘ప్రాథమికంగా ఆ ఏనుగుల మందకు ఎలాంటి హానీ లేకుండా తరిమేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. నాలుగు పిల్ల ఏనుగుల్లో ఒకటి గాయపడింది. దీంతో అవి అడవిలోకి వెళ్లడం మానేసి బహిరంగ మైదాన ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆ ఏనుగుల మంద ఉన్న ప్రాంతానికి 15 కి.మీ. దూరంలో బలియా గ్రామం ఉంది. దాని సమీపంలోని చెరుకు తోటల్లో మంద ఆశ్రయం పొందుతోంది. ప్రాణనష్టం జరుగకుండా గ్రామస్తులకు, అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి సూచనలు ఇస్తున్నాం. ప్రస్తుతం కీలక దశకు చేరుకున్న ఈ ఆపరేషన్ను గురువారం నుంచి రాత్రి వేళల్లోనూ కొనసాగించనున్నాం. కనీసం 45 కిలోమీటర్లు తరిమితే తప్ప ఆ మంద అడవిలోకి వెళ్లే అవకాశం లేదు’ అని అలీ ఖాన్ వివరించారు.