పాతబస్తీలో కార్డన్‌సెర్చ్ | Cardon Search in old city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కార్డన్‌సెర్చ్

Apr 19 2015 1:13 AM | Updated on Aug 21 2018 5:46 PM

పాతబస్తీలో కార్డన్‌సెర్చ్ - Sakshi

పాతబస్తీలో కార్డన్‌సెర్చ్

పాతబస్తీలోని ఛత్రినాక, మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం సాయంత్రం దక్షిణ మండల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

23 మంది అక్రమ ఫైనాన్సియర్లు... ఓ రౌడీషీటర్ అరెస్ట్
రెండు కత్తులు...30 వాహనాలు స్వాధీనం
 

చాంద్రాయణగుట్ట : పాతబస్తీలోని ఛత్రినాక, మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం సాయంత్రం దక్షిణ మండల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 23 మంది అక్రమ ఫైనాన్సియర్లు, ఒక రౌడీషీటర్, ముగ్గురు గుడుంబా వ్యాపారులు, పెయింట్ టిన్నర్ తయారు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాత నగరంలో వడ్డీ వ్యాపారులు పేదలను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలోపార్వతీనగర్, ఆర్.ఎన్.కాలనీ, గౌలిపురా, శ్రీరాం కాలనీ, పటేల్‌నగర్, ఛత్రినాక ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. మొత్తం 23 మంది అక్రమ ఫైనాన్సియర్లను అరెస్ట్ చే సినట్టు తెలిపారు. వీరిలో ఇతేషా ఖాన్ ఫహిల్వాన్, జునేద్, సుల్తాన్ అనే వ్యక్తులు పేదలను తీవ్రంగా వేధిస్తున్నట్లు తేలిందన్నారు. వీరితో పాటు ఉప్పుగూడ సాదత్‌నగర్‌లో ముబారక్ బిన్ అబ్దుల్లా అనే కరుడుగట్టిన రౌడీషీటర్ చిక్కాడని వివరించారు. ఆయనపై నాలుగు ఎన్‌బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బహదూర్‌పురాలో జరిగిన అసద్ హత్య కేసులో అతడు ప్రధాన నిందితుడని తెలిపారు.

ఆయన నుంచి రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఛత్రినాక పోలీస్‌ష్టేషన్ పరిధిలో ఆనంద్ శ్రీ వాత్సవ్ అనే వ్యక్తి కిరోసిన్ నుంచి పెయింట్ టిన్నర్ తయారు చేస్తూ చిక్కినట్టు డీసీపీ తెలిపారు. అతని నుంచి భారీగా నకిలీ పెయింట్ టిన్నర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేని, ట్రాఫిక్ చలానాలు కట్టని 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పార్వతీనగర్‌లోని   అడ్డాలపై దాడి చేసి 1200 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు.

మొత్తం ఐదు కేసులు నమోదు చేశామన్నారు. 15 మంది పోలీసులు ఒక టీమ్‌గా ఏర్పడి సోదాలు చేసినట్టు తెలిపారు. తనతో పాటు అదనపు డీసీపీ కె.బాబూరావు పర్యవేక్షణలో కొనసాగిన కార్డన్ సెర్చ్‌లో ఏసీపీలు గంగాధర్, అశోక చక్రవర్తి, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ, మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ గంగారాం తదితరులు పాల్గొన్నట్టు డీసీపీ సత్యనారాయణ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement