మథనం

Her fathers memories of the murder were hurting her - Sakshi

 కథా ప్రపంచం

చనిపోయిన ఆ చేపల కళ్లు రాత్రంతా తన వైపే చూడటాన్ని సుభద్ర భరించలేదు. చంపబడ్డ ఆమె తండ్రి జ్ఞాపకాలు ఆమెని వేధిస్తాయి.

సుభద్ర కూర వండిన కళాయిని కట్టెల పొయ్యి మీద నుంచి పైకి తీసింది. దాన్ని బాగా శుభ్రం చేసి, తిరిగి పొయ్యి మీద పెట్టింది. అప్పుడే తెప్పించిన కవోయీ చేపల్ని పసుపు నీటితో కడిగింది. కళాయిలో వేడెక్కిన నూనెలో ఒకదాని తర్వాత ఒకటిగా వేసింది. వాటి జీవకణాలు తప్పనిసరి మరణానికి వ్యతిరేకంగా పోరాడి ఓడిపోతున్నాయి. ఒక్కొక్కటే చిన్న విల్లు ఆకారాన్ని పొందుతున్నాయి. గతంలో ఆమె సోదరుడు కూడా సైనికుల కాల్పుల్లో చనిపోతూ ఇలాగే విల్లులా వొంగిపోయాడు.సుభద్ర చేపల్ని గరిటెతో ఇటూ అటూ తిప్పింది. వాటి చలనం క్రమంగా మందగించింది. బాగా వేగిపోయాయి. వాటిని కళాయిలోంచి తీసి ఒక ఇత్తడి పళ్లెంలో వేసింది. అవి నిర్జీవంగా పడి ఉన్నాయి. వాటి కళ్లు మాత్రం నిలబడిపోయి ఆమె వైపే చూస్తున్నట్లున్నాయి.గతంలో ఆమె తండ్రి కూడా సైనికుల బాయినెట్ల పోట్లకు నేల మీద వెల్లకిలా పడి చనిపోయాడు.

అతని కళ్లు కూడా ఇలాగే నిలబడిపోయాయి.ఈ మధ్య ఈ చేపల్ని ఆమె అసలు తినలేకపోతున్నది. కాని అకోన్‌కు ఈ చేపలంటే ఇష్టం. కాస్తంత గోధుమ రంగు వచ్చేట్టు వేయిస్తే చాలా ప్రీతిగా తింటాడు.ఇంతలో తన ఇంటి గేటుని ఎవరో తెరుస్తున్నట్లయింది. బహుశా అకోన్‌ కావచ్చు అని భావించి తలుపు తెరిచి చూసింది. కాని కాదు. ఒక మేక తన కొమ్ములతో గేటుని తెరవడానికి ప్రయత్నిస్తున్నది. నిరాశతో తలుపు మూసేసింది. వేయించిన చేపలు గల పళ్లెం మీద మూతపెట్టింది. వరండాలో చిన్న బల్ల వేసుకుని కూర్చున్నది.గాఢాంధకారం నెమ్మదిగా ప్రపంచాన్ని అలముకుంటున్నది. ఇటువంటి కాళరాత్రే అప్పటికి ఎంతోకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆమె సోదరుడు ఆమెని చూడటానికి ఇంటికి వచ్చాడు. వెంటనే ఒక కప్పు టీ తయారు చేసింది. కాని ఆ టీని అతడు ఒక గుక్క కూడా తీసుకోకుండానే ఇంటి బయట విజిల్‌ మోగింది.

తక్షణం అతడు చీకట్లో కలిసిపోవడానికి వీలుగా పెరటి ద్వారం గుండా పరుగెత్తాడు. వెనువెంటనే ఆమెకు తుపాకీ పేలిన శబ్దం వినపడింది. సోదరుడి బలమైన తొడలు ఈ చేపల్లాగే గిలగిలా కొట్టుకుని చచ్చుపడిపోయాయి.కొందరు పురుషులు బరువైన బూట్లతో భుజాల మీద తుపాకీలతో సుభద్ర వైపు రావటాన్ని ఆమె తండ్రి గమనించాడు. ఆమెకు అడ్డంగా నిల్చున్నాడు. వారు అతణ్ణి సులువుగానే ఈడ్చి నేల మీద పడేశారు. బాయినెట్‌ మొనలతో పొడిచి, బూట్లతో తన్ని తోసేశారు. అతడు వెల్లకిలా పడిపోయాడు. అతని నోటి నుంచి రక్తం స్రవించడాన్ని సుభద్ర చూసింది. అతడి కళ్లు కూడా నిలబడిపోయాయి. భయభ్రాంతురాలై పెరటి ద్వారం గుండా పరుగెత్తింది. కాని దుండగులు ఆమెని వెంబడించారు. పెరటి కొలను ఒడ్డున పొగడ చెట్టు కింద ఆమె వారికి చిక్కిపోయింది. వారు ఆమె పొడవైన జడని పట్టుకున్నారు.

తప్పించుకుని పారిపోవడానికి శతవిధాల ప్రయత్నించింది. కాని విఫలమైంది. వారు ఆమె దుస్తుల్ని ఒలిచేశారు. సైనికులు ఒక పద్ధతి ప్రకారం ఆమె హృదయంలో ప్రేమగా పదిలంగా దాచుకున్న పవిత్రతని చీలికపేలికల్ని చేసి పోయారు.ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలీదు. కాని ఆస్పత్రిలో కళ్లు తెరవగానే మొదట చూసింది అకోన్‌ మెరుపు కళ్లనే. ఆమెలో విషాదం పెల్లుబికింది. తన సొంతమైన, రహస్యమైన, నిద్రాణమైన భావనా మహారణ్యంలోని వృక్షాలు ఒకదాని తర్వాత ఒకటి నేల కూలిపోసాగాయి. మధురమైన గీతాల్ని ఆలపించిన పక్షులు రెక్కలు తెగి ఇప్పుడే తను మాడ్చిన కవోయి చేపల్లా నేలపై నిర్జీవంగా పడిపోయాయి. ఆమె తనదనుకున్న సర్వమూ ఎడారిమయమైపోయింది. ఆమె ఆశలూ ఆశయాలూ కలలూ కోరికలూ పాతాళానికి కృంగిపోయాయి. చెప్పలేని, చెప్పుకోలేని బాధ ఆమెని ఆవహించింది. అకోన్‌ ఆమె చేతుల్ని పైకెత్తి పట్టుకుని కన్నీరు తుడిచాడు.బాధోదేవిని తులసి, త్రికంటక మొక్కల మధ్యనున్న ఒక సమున్నతమైన వేదికపై ప్రతిష్ఠించి, పవిత్రంగా పూజిస్తారు. సుభద్ర తన శరీరాన్ని అంతవరకు అంతే పునీతంగా అనాఘ్రాతంగా కాపాడుకున్నది.

ఆ స్థితిలోనే అకోన్‌కు సమర్పించాలనుకున్నది. కాని ఆ కిరాతకులు ఆమె శరీరాన్ని ఒక దోసపండు మాదిరిగా చిదిమి నమిలేశారు. అకోన్‌కు ఏమీ మిగల్లేదనే వేదన ఆమెని బలంగా ఆవహించింది.అయినా అకోన్‌ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలోకి ఆహ్వానించాడు. బోకుల్‌ పుష్పాల పరిమళం గల చుంబనని అందించాడు. కాని సుభద్ర గత పీడకల నుంచి విముక్తురాలు కాలేకపోయింది. అకోన్‌ ఆలింగనలో ఉన్నప్పుడు కూడా ఆమె వేడినూనెలో చుట్టుకుపోయిన చేపలాగే వంకర్లు తిరిగేది. ఆమె శరీరం తిరుగుబాటు చేసేది. అకోన్‌ సముదాయించేవాడు. కాని ఆమె అపరాధనాభావం నుంచి తప్పుకోలేకపోయింది. మనసులు ఒకటిగా ఉన్నా, శరీరాలు వేరుగా ఉండేవి. అకోన్‌ బోకుల్‌ పుష్పాల సువాసనని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించేది. కాని ఆనాటి వేడి నిట్టూర్పుల దుర్భరమైన దుర్వాసన ఆ సువాసనని తుడిచివేసేది. ఆమె భయాల్ని తొలగించడానికి అకోన్‌ ఎంతగానో ప్రయత్నించేవాడు. మృదువుగా తాకి లాలించి ఆలింగనం చేసుకునేవాడు. కాని ఆమెలో ఏమాత్రమూ స్పందన కలిగేది కాదు.

అకోన్‌ విసిగిపోయాడు. ఒకవిధమైన అలసటా అసహాయతా ఆవరించాయి. ఆశాంతితో అల్లాడిపోయాడు.కాలం గడుస్తున్నది. గ్రీకు పురాణాల్లోని టాంటాలిస్‌లాగా చుట్టూ నీటిని పెట్టుకుని దాహంతో అలమటించేవారు.నెమ్మదిగా అకోన్‌కు సుభద్ర మానసిక వైకల్యం అర్థమైంది. అకోన్‌ భౌతికావసరాలు తీరడంలేదని ఆమెకూ తెలుస్తున్నది. ఇద్దరూ పక్కపక్కనే నిద్రపోయేవారు. వారి చేతి వేళ్లు అల్లుకునే ఉంటాయి. కళ్లు తెరుచుకునే ఉంటాయి. కాని రెండు శరీరాల మధ్య వేల మైళ్ల దూరం ఉన్నట్లుంటుంది.ఈ దశలో సుభద్ర ఎంతో ఆలోచించింది. అకోన్‌కి దీపాలీతో పెళ్లిని ప్రతిపాదించింది. అకోన్‌ వ్యతిరేకించాడు. కాని అతణ్ణి ఒప్పించింది. చివరికి అకోన్‌ని దీపాలీకి సమర్పించింది. ఈ ఏర్పాటు తప్పనిసరైంది.ఇప్పుడు సుభద్ర అకోన్‌ని గత ఐదు నెలలుగా చూడలేదు. అతడు ఎప్పుడూ ఇంతకాలం సుభద్ర నుంచి దూరంగా ఉండలేదు. ప్రతిరోజూ ప్రతిక్షణమూ అతని కోసమే ఎదురుచూస్తున్నది. చిన్న గాలి తెర కూడా ఆమెను ఉత్తేజితం చేస్తున్నది.ఎవరో గేటు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అకోన్‌ కావచ్చు. ఒక్కసారిగా ఆమె సంతోషపు ఉద్వేగానికి లోనైంది.

కాని ఆ మనిషి దగ్గరకు వచ్చేసరికి అకోన్‌ కాడని గుర్తించింది. బాపూ కోన్‌ అనే బంధువు నిన్నటి దినపత్రిక పట్టుకొని వచ్చి ఇచ్చాడు. వారికి నిన్నటి దినపత్రిక ఈరోజు సాయంకాలానికి వస్తుంది. ఆ ఊరికి పట్నం నుంచి వెళ్లే ఒకే ఒక్క బస్సు ఉన్నది. ఆ బస్సులోనే దినపత్రిక ఒక దినం ఆలస్యంగా వస్తుంది. ఆమె పేపరు అందుకొని పక్కన పెట్టేసింది. దాన్ని తిరగవెయ్యాలని ఆమెకు అనిపించలేదు.సుభద్ర పరుపుమీద చేరబడింది. ప్రపంచమే ఆమెకు శత్రువైనప్పుడు ఇంక చేసేదేముంది?ఈ మధ్య అకోన్‌ పరోక్షంలో ఆమె మనస్సు దేనిపైనా లగ్నం కావడం లేదు. ఏమీ ఆలోచించలేకపోతున్నది. ఏమీ చెయ్యలేకపోతున్నది. రోడ్డు పక్కన ఉన్న కాలువలో చేపలు పట్టడానికి స్నేహితురాళ్లతో కలసి వెళుతుంది. కాని వెదురు వల వైపు చేపల్ని రొప్పటం మరచి పరధ్యానంగా చూస్తూ ఉండిపోతుంది. కొన్నిసార్లు చేతికి దొరికిన చేపల్ని తన పక్కనున్న బుట్టలో వెయ్యడానికి బదులుగా తిరిగి వల వైపు పడవేస్తుంది. సాయంకాలమయ్యే సరికి అకోన్‌ ఇంటి వద్దకు వెళుతుంది. నేలకు ఒంగిన ఉసిరి కొమ్మల మధ్య నిలుచుంటుంది.

దాని కాండంలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని ఆలింగనం చేసుకుంటుంది. అకోన్‌ ఇంటి వద్ద ఉంటే ఆ కొమ్మ మీదనే ఎక్కువ కాలం కూర్చొని గడుపుతుంటాడు.‘‘సుభద్రా! నువ్వు తిన్నావా?’’ పినతల్లి పిలుపుతో ఈ లోకంలోనికి వచ్చింది. ‘‘తిన్నాను’’ అబద్ధం చెప్పింది. ‘‘ఆకుకూర చేశాను. నీకు కావాలా?’’ సుభద్ర అడిగింది.‘‘ఇవ్వు. నాకూ ఇష్టమే’’ పినతల్లి ఉత్సాహంగా అడిగింది. సుభద్ర ఆమెకు ఆకుకూరతో పాటు వేయించిన చేపల్నీ ఇచ్చింది. ఎందుకంటే చనిపోయిన ఆ చేపల కళ్లు రాత్రంతా తన వైపే చూడటాన్ని సుభద్ర భరించలేదు. చంపబడ్డ ఆమె తండ్రి జ్ఞాపకాలు ఆమెని వేధిస్తాయి.ఒక గ్లాసు మంచినీరు తాగి తలుపు మూసుకుని పరుపు మీదకు చేరింది. ‘‘అకోన్‌ తనని మరచిపోయాడా? ఈ భావం ఆమె తలను పదే పదే గుచ్చసాగింది. మానసికారణ్యంలో ఒకప్పుడు కూలిపోయిన చెట్లు ఇప్పుడు మట్టిలో కలసిపోయినట్లుగా భావిస్తున్నది. ఒకప్పుడు ఆ నేల కళకళలాడుతుండేది. కాని ఆ అవశేషాలు కూడా ఇప్పుడు శాశ్వతంగా మాయమయ్యాయి.దీపాలీతో పెళ్లికి అకోన్‌ను ఒప్పంచింది తనే.

అతణ్ణి దీపాలీకి అప్పచెప్పింది తనే. మరి ఇప్పుడు అకోన్‌ దీపాలీతో సంతోషంగా ఉన్నాడనీ, తనకు దూరమైపోతున్నాడనీ విచారించడం, అసూయపడటం అర్థంలేని అంశం.విజయదశమి తర్వాత నిమజ్జనం చేసిన దేవతని తిరిగి ఆవాహన చెయ్యడం సాధ్యం కాదు.సుభద్ర తనని తానే సంభాళించుకున్నది. వృక్షరహిత శూన్య మహారణ్యం వంటి ఏకాంతాన్ని భరించడానికి సిద్ధపడక తప్పదు. తన వంటి వారికి సగం చచ్చిన జీవితమే లభిస్తుంది. ఆ స్థితి నుంచి తప్పించుకోలేరు.ఆనాటి వేడి దుర్గంధపూరితమైన నిశ్వాసాలు ఆమె ముక్కుకు అంటిపట్టేసి ఉన్నవి. చెరిగిపోవడం లేదు. నిజానికి ఆమె ఘ్రాణశక్తి పూర్తిగా చెడిపోయింది. ఎంత మంచి సువాసనైనా ఆమెకు ఆ దుర్వాసనలాగానే ఉంటున్నది. మంచు ముట్టుకున్నా వేడి నిశ్వాసాలే గుర్తొస్తున్నాయి.అయినా ఈరోజు అన్నీ మరచి, గతాన్ని విస్మరించి, ఉత్సాహంగా అకోన్‌ కోసం ఎదురు చూస్తున్నది. ఆమె పరిస్థితి తనని స్పృశించబోయే రంగు కోసం ఎదురు చూస్తున్న కాన్వాస్‌లా ఉన్నది.ఇది నిజంగా ఆమెకు సిగ్గుచేటైన విషయం. ఆమెకు ఇటువంటి తలపులు రానేకూడదు.

జరగని దాన్ని అతడి నుంచి ఆశించడం, దీపాలీని బాధపెట్టడంలో ఏమాత్రమూ న్యాయం లేదు.సుభద్ర సోదరుడు ఉగ్రవాదిగా మారి ఒక రైలులోని అమాయకులైన వందలాది ప్రయాణికుల్ని బలి తీసుకున్నాడు. మరి వారికీ ఆశలూ ఆశయాలూ ఉండి ఉంటాయి. ఆ కారణం చేతనే సైనికులు వాణ్ణి మట్టుపెట్టారు.కాని సుభద్ర ఎవరికీ ఏమీ అపకారం చెయ్యలేదు. కనీసం కీడు తలపెట్టలేదు. అయినా ఆమె జీవితం నాశనమైపోయింది. సుభద్ర తండ్రి కూడా సాధారణ రైతు. అతడూ ఎవరికీ హాని చెయ్యలేదు. కాని వాళ్లు అతణ్ణి కూడా చంపేశారు. వారికి విచక్షణ లేదు.ఆమె చేసిన నేరమంతా సోదరుడికి కప్పు టీ ఇచ్చింది. ఆ కుమారుడికి తండ్రి కావడం వల్ల తన తండ్రి కూడా బాయినెట్‌ మొనకు జీవితాన్ని బలి చేసుకున్నాడు. అందరు అమ్మాయిల్లాగానే సుభద్ర కూడా చదువుకున్నది. తన జన్మభూమికి సంబంధించిన సంస్కృతీ సంపదల్నీ, నాగరికత ఔన్నత్యాన్నీ అధ్యయనం చేసింది. కాని ఆమె మిగిలిన అమ్మాయిల కంటే భిన్నమైనదిగా తయారైంది. ఆమె గుండె అవమాన భారంతోనూ నిష్ఫలత్వంతోనూ కొట్టుకుంటున్నది.

ఇటువంటి అన్యాయానికి ఎవరైనా బదులు తీర్చుకోవాలి. ఆమె మనస్ఫూర్తిగా అకోన్‌ని అక్కున చేర్చుకుని ఆనందించలేకపోవడానికి బాధ్యులెవరు? అందరూ ఒకే దేశానికి చెందినవారమని చెబుతారు. మరి వారిలో తనూ, సోదరుడూ, తండ్రీ ఎందుకు లేరు?మట్టి గోడల రంధ్రాల్లోంచి సూర్యకిరణాలు ముఖం మీద పడగా సుభద్ర లేచింది. బాగా ఆకలి వేస్తున్నది. మొన్న మధ్యాహ్నం నుంచి ఆహారం ఏమీ తీసుకోలేదు. ‘అకోన్‌ వస్తున్నాడు’ అనే ఆలోచనే ఆకలి లేకుండా చేసింది. అది తర్వాత ‘అకోన్‌ రావడం లేదు’ గా మారింది. విషాదమూ, కన్నీరూ ఆకలిని మరచిపోయేట్టు చేశాయి. ఆమెలో ఒక శూన్యం ఏర్పడింది. ఈరోజు ఆదివారం. కాబట్టి తొందరేమీ లేదు.టీ చప్పరిస్తున్న సుభద్ర నిన్నటి పేపర్ని తిరగవేసింది. ‘చబుదా వద్ద కొందరు స్త్రీలపై సైనికులు అత్యాచారం చేశారు’ అన్న వార్త కంటపడింది. హఠాత్తుగా ఆపాదమస్తకమూ ఒక అగ్నికీల ఆమెలో వ్యాపించింది.గోడకు చేరబడి కనులు మూసుకున్నది. ఆ స్త్రీలు ఆమెకు స్పష్టంగా కనపడుతున్నారు. వారి ఆర్తనాదాలు అతి చేరువగా వినపడుతున్నాయి. వారి మనోవేదన అర్థమవుతున్నది.మానవజాతిలో కేవలం స్త్రీలకు మాత్రమే ఎదురయ్యే దారుణమైన దౌర్భాగ్యం ఇది. ఈ భారాన్ని జీవితాంతం మోసుకు తిరగాలి. గత్యంతరం లేదు. తప్పించుకునే మార్గమే లేదు.

ఇప్పుడు ఉన్నతాధికారులతో కూడిన ఒక కమిటీని నియమించి నిజ నిర్ధారణ చెయ్యమంటారు. కేవలం అదొక ప్రహసనం మాత్రమే. ఆ తర్వాత ఆ నివేదికలు బుట్టదాఖలవుతాయి. అటువంటి కాగితాలు ఆయా కార్యాలయాల్లో గుట్టలుగా పోగుపడి ఉంటాయి. అంతే! ఆ నిర్భాగ్య స్త్రీలు కంటి మీద కునుకు లేకుండా, సుదీర్ఘమైన దుర్భరమైన రాత్రుల్ని జీవితాంతం గడుపుతారు. దుర్గంధపు వేడి నిట్టూర్పులు వారి నాసికా పుటాలకు పట్టేసి ఉంటాయి. ఆ జ్ఞాపకాలు వారి మనసుల్ని తూట్లు పొడుస్తూ ఉండగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఈ పరిస్థితే కొనసాగితే ఇలా నాశనమైన స్త్రీల గణనీయమైన వర్గం ఒకటి అస్సాంలో తయారవుతుంది. వీరందరూ ఏకమైతే ఆ కిరాతకుల్ని గొంతు పిసికి చంపగలరు. ‘‘బైద్యూ! మేమొచ్చాం.’’ సుభద్ర వద్దకు ట్యూషన్‌కు వచ్చే పిల్లల కేకతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ‘‘వెళ్లండి. చాప పరుచుకోండి’’ అంటూ తనూ ఒక చిన్న బల్ల తెచ్చుకుని కూర్చున్నది. ‘‘ఇవాళ మనం డిక్టేషన్‌ చెప్పుకుందాం’’ అన్నది. పుస్తకం తెరిచి అందులోని వాక్యాల వైపు చూసింది.‘‘భారతదేశం మా మాతృభూమి.

ఇప్పుడు మేం స్వతంత్ర భారత పౌరులం. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వెల్లివిరుస్తున్నవి. వీటిని కాపాడవలసిన బాధ్యత మనకున్నది. ఈ దేశంలో అత్యంత పురాతనమైన సంస్కృతీ నాగరికతలు వేలాది సంవత్సరాలుగా చోటు చేసుకున్నవి. ఇక్కడ పౌరులందరూ సమానమే..’’ సుభద్ర అంతరాత్మలోంచి ఏదో తిరుగుబాటు ధ్వని వినపడింది. నిజంగానే పౌరులందరూ స్వతంత్రంగానే జీవిస్తున్నారా? నిజంగానే దేశమాత తన అమృత దృక్కులతో ప్రజలందర్నీ సమానంగానే చూస్తున్నదా? తమ తల్లులూ సోదరీమణులూ అయిన స్త్రీలను ఈ దేశపు పురుషులే మానభంగాలు చేసే దేశం నాగరికమైనదేనా? మరి ఈనాటి ‘రేపటి పౌరుల’కు అబద్ధాలను బోధించడం సబబేనా?ఈ చిన్నారి బాసంతి ఈ పాఠాలన్నీ చదివి పెరుగుతుంది. చివరకు ఏదో ఒకరోజు తన తోటివారే తన జీవితాన్ని నాశనం చెయ్యగలరని తెలుసుకుంటుంది.ఈ చిట్టి గోకుల్‌ ఇవన్నీ చదివి యువకుడవుతాడు. తన ప్రజల్ని ఉద్ధరించాలనుకుంటాడు. సమస్యలనీ, దరిద్రాన్నీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రశ్నిస్తాడు. ఎవరూ పట్టించుకోరు.

చివరికి నిరసన గళం విప్పుతాడు. వాణ్ణి తూటాలకు బలి చేస్తారు. ‘‘బైద్యూ! ఏమని రాయమంటారు?’’ అడిగారు పిల్లలు.‘‘పిల్లలూ! ఇప్పుడు రాయండి’’ సుభద్ర అన్యమనస్కంగా చెప్పసాగింది. సతత హరితమైన మా నేలలో ఉద్భవించిన లతల వలెనే మా శరీరాలు మట్టి పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. మానవత్వాన్ని కాపాడటమే మా బాధ్యత. నాగరికమైన దేశం అని చెప్పుకుంటున్న ఈ నేల హత్యలనీ, మానభంగాలనీ భరించలేదు. అరణ్యాల సుకుమారమైన ఏకాంతాన్నీ నిశ్శబ్దాన్నీ తుపాకీ కాల్పులు భగ్నం చెయ్యలేవు. చెయ్యకూడదు. ఇక్కడ నిర్భయంగా జీవించడం మా జన్మహక్కు..’’సుభద్ర ఆగింది. బయటి నుంచి ముకుల్‌ అనే అబ్బాయి చేరువగా వచ్చి ఆమెకు ఒక ఉత్తరాన్ని అందించాడు. ‘‘అకోన్‌దా మీకిమ్మని పంపాడు’’సుభద్ర దాన్ని అందుకున్నది. ‘‘పిల్లలూ! ఇప్పుడు ఇళ్లకు వెళ్లండి. సాయంత్రం రండి’’ అని పంపేసింది.ఉత్తరాన్ని తెరిచింది. చదివింది. ‘‘దీపాలీకి ఒంట్లో బాగాలేదు. లేవలేకపోతున్నది. ఏమీ తినలేకపోతున్నది. చాలా ఇబ్బందిపడుతున్నది. అందుకే ప్రస్తుతం నేను రాలేకపోతున్నాను.

కాబట్టి..’’ఆమె ఉత్తరాన్ని మడిచింది. అకోన్‌ దీపాలీని పెళ్లి చేసుకునే ముందు ఉత్తరం రాయవలసి వస్తే, ‘‘ప్రియమైన సుభద్రా!’’ అని మొదలుపెట్టి ‘‘నీ అకోన్‌’’ అని ముగించేవాడు. ఇప్పుడు అటువంటి పాటింపులు ఏమీ లేవు. ఉత్తరం బజారుకెళ్లేటప్పుడు రాసే జాబితాలాగా ఉన్నది. సుభద్రలో ఏదో తీవ్రమైన సంచలనం కలిగింది.తమ వివాహం తర్వాత అకోన్‌ బాధని కళ్లారా చూసింది. ఆమె కూడా ఖేదించింది. కానీ అతడికి సాంత్వన ఇవ్వలేకపోయింది. అందుకే గత్యంతరం లేక ఇష్టపూర్వకంగానే అతణ్ణి దీపాలీకి ఇచ్చివేసింది.త్యాగం చేసిన పదార్థం కోసం విచారించడం వివేకం కాదు.సుభద్ర ఎవరికీ చెందదు. ఈ నేలకూ చెందదు. ఈ గాలికీ చెందదు. ఏ వ్యక్తికీ చెందదు. అకోన్‌ దూరమవుతుండటంతో ఆమె మార్గం మరింత సుగమమవుతున్నది.ఒక్క అంశం మాత్రం మిగిలి ఉన్నది. ఆ దుర్మార్గుల్ని గుర్తించి, వారి లైంగికావయవాల్ని కత్తిరించి, వారిని కవోయి చేపల్లా మాడ్చి చంపాలి. ఇదొక్కటే ఆమె జీవిత ధ్యేయం.ఈ దేశంలో ఒకనాటి సువర్ణమయమైన గతాన్ని భవిష్యత్తులో వికసింపచెయ్యాలి. సుభద్ర గుండె వేగంగా కొట్టుకున్నది.

ఇంతలో ఎవరో వచ్చిన సడి వినిపించింది.‘‘సుభద్రా! మా అబ్బాయి చేత ఏమిటిలా రాయించావు?’’ జతుల్‌ తండ్రి ఒక నోట్‌ పుస్తకాన్ని ఆమెకు అందించాడు. ‘‘మీ నాన్నా, సోదరుడూ సైనికుల తూటాల వల్లనే చనిపోయారు. అలా అయితే నువ్వు కూడా తొందర్లోనే జైలుకెళ్తావు. మా పిల్లవాడికి ఇలాంటి తిరుగుబాటు ధోరణులు తలకెక్కించదలచుకుంటే వాణ్ణి నీ వద్దకు ట్యూషన్‌కు పంపను’’ ఈ మాటలు అనేసి చిరాగ్గా వెళ్లిపోయాడు.సుభద్ర ఆ నోట్‌ పుస్తకం వైపు చూసింది.నిజమే తన ఆలోచనల్నే డిక్టేషన్‌గా చెప్పింది.ఒకప్పుడు జతుల్‌ తండ్రి కూడా తన సోదరుడిలాగానే విప్లవ భావాలతో సాటి కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేవాడు. కాని ఆ మార్గం కంటకమయమని గ్రహించి, ఇప్పుడు పోలీసు శాఖలో చేరిపోయాడు. కత్తి మీద సాము చేస్తున్నాడు. ‘‘మా పిల్లవాణ్ణి నీ వద్దకు ట్యూషన్‌కు పంపను’’ ఈ మాటలు సుభద్ర మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి.

సుదూరంగా మంచు నిండిన పర్వతశ్రేణుల్లో వేగిన కవోయి చేపల కళ్ల వంటి ఆమె తండ్రి నిర్జీవమైన నేత్రాలు కనపడుతున్నాయి. నేలకూలి గిలగిలా కొట్టుకుని స్తంభించిపోయిన తన సోదరుడి తొడలు కనపడుతున్నాయి. ఆ పర్వతసానువుల్లో మహావృక్షాలు నేలకు ఒరిగిపోతున్నాయి.‘‘మా పిల్లవాణ్ణి నీ వద్దకు..’’ ఈ మాటలు ఆమె దీనస్థితిని సవాలు చేస్తున్నాయి.లేదు. నేను ఇక ముందు స్థిరంగా నిలబడాలి. పరిస్థితుల్నీ, జీవితాన్నీ ఎదుర్కోవాలి. ఇలా ఒక దృఢమైన నిశ్చితమైన వైఖరితో యోచించసాగింది.
‘‘నా ట్యూషన్‌లో ఎవరో ఒకరు చదవకపోయినా నష్టంలేదు’’ అనుకున్నది.
అస్సామీ మూలం : ఫూల్‌ గోస్వామి
అనువాదం: టి.షణ్ముఖరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top