సత్సంకల్పంతోనే సాఫల్యం
ఇస్లాం వెలుగు
కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యదార్ధాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కితిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్తసంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరికోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసి పోవలసినవారే. కొత్తసంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తు కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్తసంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల అతిక్రమణ జరగకుండా చూసుకోవాలి.
నిషిద్ధకార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే చర్యలకు దూరంగా ఉండాలి.కాలం చెప్పే చారిత్రక వాస్తవాలనుండి గుణపాఠం గ్రహించకుండా లక్ష్యరహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్తసంవత్సర ప్రారంభాన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచిపనులు చేసి ఉంటే భవిష్యత్ కాలంలో వాటిని మరింతగా విస్తరిస్తామని, తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే ఖచ్చితంగా వాటిని ఈ క్షణం నుండే విసర్జిస్తామని సంకల్పం చెప్పుకోవాలి.ఈ విధంగా అందరూ కాలం విలువను గుర్తించి, విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్నిగురించి బోధిస్తూ, స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ గడచినకాలం నుండి గుణపాఠం గ్రహిస్తూ, భవిష్యకాలాన్ని దివ్యంగా మలచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని,సమస్తమానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తంకావాలని మనసారా కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్