Sakshi News home page

క్యాన్సర్‌ చంపలేదు

Published Sat, May 20 2017 12:20 AM

క్యాన్సర్‌ చంపలేదు

‘నాన్నా! నన్ను బతికించవూ ప్లీజ్‌!’’
ఇది సాయిశ్రీ వాళ్ల నాన్నతో పెట్టుకున్న మొర.
నాన్న ట్రీట్‌మెంట్‌ చేయిస్తే తను బతుకుతాననుకుంది.
నాన్న బతకనేర్చినోడని సాయిశ్రీ తల్లి చెబుతోంది.
సాయిశ్రీని క్యాన్సర్‌ చంపలేదు.
వాళ్ల నాన్నకు, మన వ్యవస్థకు పట్టిన క్యాన్సర్‌ చంపేసింది.


తల్లి పెట్టే గోరు ముద్దలు తింటూ ఆడుకోవాల్సిన పసిప్రాణంతో మృత్యువు ఆటలాడింది. మాతృదినోత్సవం రోజునే తల్లికి దూరం చేసింది. తన బాధను సెల్ఫీ వీడియోలో వివరించినా ఆ తండ్రి గుండె కరగలేదు. పిల్లల కాల్లో ముల్లు దిగితేనే విలవిలలాడిపోతాం. కబుర్లు చెబుతూ వారి దృష్టి మళ్ళించి దాన్ని తీసి పారేస్తాం. తన కుమార్తెకు వచ్చింది ప్రాణాంతకమైన బ్లడ్‌క్యాన్సర్‌ అని తెలిసినా తండ్రి హృదయం కరగలేదు. ఆ పాషాణ హృదయుడి పేరు మాదంÔð ట్టి శివకుమార్‌. ప్రాణాలు విడిచిన చిన్నారి సాయిశ్రీ. ఈ ఇద్దరి మధ్య నలిగిపోయింది తల్లి సుమశ్రీ. కన్నబిడ్డ బాధ చూడలే క తల్లడిల్లిపోయింది. ‘అమ్మా నొప్పి’ అని ఏడిస్తే... తానూ ఏడ్చింది. ‘మూలుగ’ మార్పిడి చేయిస్తే వ్యాధి తగ్గుతుందన్న వైద్యుల మాటలు ఆశను కల్పించాయి. వైద్యం చేయించమని తనను విడిచి వెళ్ళిన భర్తను ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఆ తల్లి హృదయవేదన ఎలా ఉంటుంది. పగిలిన మాతృత్వపు జాడల నుంచి వెలువడిన ఆ తల్లి మాటల మంటలు యథాతథంగా...

పాపను బతికించుకోలేకపోయాను....
‘‘పాప ప్రాణాలు పోతే ఆస్తి అంతా తనకే వస్తుందనుకున్నాడు. ముక్కుపచ్చలారని పసిపాప రోదన ఆ రాతిగుండెను కదిలించలేకపోయింది. ఇంతటి దారుణం ఎక్కడా జరిగి ఉండదు. పదమూడేళ్ల నా కుమార్తె సాయిశ్రీ మర ణానికి ప్రత్యక్షంగా కారణమయ్యాడు తండ్రి. సాయిశ్రీ తండ్రి ప్రేమకు ఏనాడో దూరమైంది. ఇప్పుడు నా ఒడి నుంచి కూడా దూరంగా  ళ్లిపోయింది. నా పాప ఏం పాపం చే సింది. ఏ తప్పు చేసింది. తనను పుట్టించమని అడిగిందా... లేదే. తనను బ్రతికించమని వేడుకుంది. నా బిడ్డ రోదన అతడి పాషాణ హృదయానికి వినిపించలేదా? పశుపక్ష్యాదులు కూడా తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఈ దానవ తండ్రులకు కన్నసంతానం మీద మమకారం కలగదా. పేగుబంధం కంటే నోటుబంధమే ఎక్కువైందా? ఆదివారం మాతృదినోత్సవం నాడు పిల్లలందరూ తల్లికి బహుమతులు ఇస్తుంటే నా బిడ్డ మాత్రం నాకు గర్భశోకం మిగిల్చి ఎప్పటికీ కనిపించనంత దూరం వెళ్లిపోయింది.

పాప ఆస్తి కోసమే!
పాప కన్నతండ్రి, రాజకీయ నాయకులు కలిసి నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. పాప మర ణిస్తే ఆస్తి అంతా తండ్రికి వస్తుందనే దురుద్దేశంతోనే పాపకు వైద్యం చేయించలేదు. మా పాప తను పడుతున్న బాధను సెల్ఫీ తీసి తండ్రికి పంపింది. అయినా ఆ రాతి మనిషి హృదయం కరగలేదు. స్థానిక ఎంఎల్‌ఏ అండదండలతో మా ఇంటిని కూడా అమ్మనివ్వలేదు. ఆ ఇల్లు పిల్ల పేరున ఉంది. అది అమ్మి వైద్యం చేయిద్దామంటే వాళ్లు పడనీయలేదు. చేతిలో డబ్బులేక నా పిల్లను బతికించుకోలేకపోయాను.

అధికార పార్టీ ఎంఎల్‌ఏ అయి ఉండీ...
పాప విషయం వార్తల్లో రావడం... అందులో ఎమ్మెల్యే పేరు ఉండడంతో ఆయన తప్పుకోడానికి పథకం వేశారు. భార్యాభర్తల గొడవ వల్లే ఈ సంఘటన జరిగిందనిట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. భర్తతో ఎన్ని గొడవలున్నా కన్నతల్లి బిడ్డను చంపుకుంటుందా? ఆయన అధికార పార్టీ ఎంఎల్‌ఏ అయి ఉండీ నా బిడ్డను ఎందుకు కాపాడలేకపోయారు? ఉన్నత పదవిలో ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? అంతేకాదు... నా పాప మరణించిన టైమ్‌ విషయంలో కూడా అబద్ధం చెబుతున్నారాయన. పాప మధ్యాహ్నం 12.05 ని.లకు చనిపోతే, సాయంత్రం ఆరు గంటలకు జరిగిందని చెబుతున్నారు. నేను 108కి ఫోన్‌ చేసిన సమయం కాల్‌లిస్ట్‌లో రిజిస్టర్‌ అయి ఉంది. నా భర్త కన్నకూతురిని ఎందుకిలా నిర్లక్ష్యం చేశాడు?

బాధ భరించలేకపోయింది...
2016, ఆగస్టులో పాపకు తరచు జ్వరం వస్తుంటే డాక్టర్‌కి చూపించాం. బ్లడ్‌ క్యాన్సర్‌ అని తెలిసింది. వెంటనే ఆపోలో ఆసుపత్రిలో చేర్పించాను. సుమారు 25 లక్షలు ఖర్చు చేశాను. కీమోథెరపీ చేశాక బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తే పాపకు తగ్గుతుందని అపోలో డాక్టరు చెప్పారు. అందుకు 40 లక్షల ఖర్చు అవుతుందన్నారు. పాప కోసం ఇల్లు అమ్మేయడం తప్ప మరోదారి లేదు నాకు. అందుకు నా భర్త ససేమిరా అన్నాడు. పైగా స్థానిక ఎంఎల్‌ఏ అనుచరుల అండతో అడ్డుకున్నాడు. పాప పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోయింది. పాప బా«ద భరించలేకపోయేది. ఒకరోజు తన బాధను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి తండ్రికి పంపింది. ఆ కర్కశ హృదయం కరగకపోగా, ఆనందపడింది. పాప చనిపోతే ఉన్న ఇల్లు కూడా తనకే వస్తుందని భావించి ఉంటాడు, అందుకే ఇంటిని అమ్మే అవకాశం లేకుండా చేశాడు ఆ దుర్మార్గపు తండ్రి.

బతికుండగా చేయలేదు కానీ...
ప్రభుత్వ సహాయం కోసం వెళితే తెల్ల కార్డు ఉందా అని, ఆరోగ్యశ్రీ నుంచి నాలుగు లక్షలు మాత్రమే వస్తుందని చెప్పారు. ఏమీ దిక్కు తోచని పరిస్థితి నాది. బతికుండగా నా బిడ్డని కాపాడనివారు, ఇప్పుడు సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఏం లాభం. ఎంత డబ్బు వచ్చినా... నా బిడ్డ ప్రాణం తిరిగి వస్తుందా?.

నా ప్రమేయం లేకుండానే...
అసలు నా వివాహమే బలవంతంగా జరిగింది. నా తండ్రి చిన్నప్పుడే మరణించారు. అమ్మకి ఏమీ తెలియదు. ఇద్దరు తమ్ముళ్లు. విజయవాడ సిద్ధార్థ కళాశాల దగ్గరకు ఈయన (శివకుమార్‌) వస్తుండేవాడు. మా ఇల్లు అక్కడే. రోజూ నన్ను చూసేవాడు. కొంతకాలం తరవాత నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆయనకు పెళ్లయిందట. ఆ విషయం నాకు తెలియదు. ఆవిడకు ఇద్దరు కొడుకులు. మొదటి భార్యను ఒకటో అంతస్థులోను నన్ను గ్రౌండ్‌ ఫ్లోర్‌లోను ఉంచాడు. నాకు ప్రెగ్నెన్నీ వచ్చి ఏడో నెల వచ్చేవరకు నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. పాప పుట్టిన తరవాత పాప కోసం బతకాలనుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను. 2008లో ఇంక అతడు పెట్టే బాధలు పడలేక అతడి శా స్టిక్‌ నేచర్‌ తట్టుకోలే క బయటకు వచ్చేయాలనుకున్నాను. విజయవాడ మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇచ్చాను. వారు విచారించి, ‘అతడికి జైలుశిక్ష వేయమంటావా, భరణం ఇప్పించమంటావా’ అని అడిగారు.

జైలుశిక్ష వేసినా, శిక్షపూర్తయి బయటకు వచ్చిన తరువాత మళ్లీ నన్ను హింసిస్తాడని తెలుసు. అందుకే నాకు ఏమీ వద్దు, అతడు నా జీవితంలోకి రాకుండా ఉంటే చాలు అని చెప్పి వచ్చేశాను. అప్పటి నుంచి ఒక్కర్తినే పాపతో ఉంటున్నాను. జీవితంతో పోరాడాను. అయినా ఇలా అయింది. పాప దక్క లేదు. నా పాప ప్రాణం తీసింది క్యాన్సర్‌ కాదు, నా భర్తకు, సొసైటీకి పట్టిన క్యాన్సరే’.


ఎవరి డ్యాన్స్‌ చూసినా!
పాప బాగా టాలెంటెడ్‌. హైదరాబాద్‌లో అమీర్‌పేట్‌ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో చదివేది. టీచర్లందరికీ సాయిశ్రీ అంటే చాలా ఇష్టం. చాలా బాగా డ్యాన్స్‌ చేస్తుంది. తనే కంపోజ్‌ చేసుకుంటుంది. ఎవరి డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ చూసినా నాకు పాపే గుర్తుకు వస్తోంది.

తండ్రి నోట... అంతటి మాట!
పాప స్కూల్‌ నుంచి వస్తూనే జ్వరంతో పడుకునేది. ఇలా వారం రోజులు వరుసగా జ్వరం వస్తుండటంతో హాస్పిటల్‌లో చూపించాం. టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేసి అంతా బాగానే ఉందన్నారు. జ్వరం కంట్రోల్‌ అయ్యేది కాదు. ఆ తరవాత సిబిపి చేశారు. అందులో ఎఎంఎల్‌ బ్లడ్‌ క్యాన్సర్‌ అన్నారు. వెంటనే హైదరాబాద్‌ అపోలోలో ట్రీట్‌మెంట్‌ ప్రారంభించాం. 2016 ఆగస్టు నుంచి 2017 జనవరి వరకు ట్రీట్‌మెంట్‌ చేశారు, తగ్గిపోయింది. అప్పుడు విజయవాడకు వచ్చాం. నెల రోజులకే మళ్లీ జ్వరం రాసాగింది. మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళితే బోన్‌ మ్యారో మార్చాలి, చికిత్సకు 40 లక్షల దాకా ఖర్చవుతుందన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకని పాప వాళ్ల నాన్నకి వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టింది. అయినా ఆ తండ్రి గుండె కరగకపోగా ‘నిన్ను కనడమే నేను చేసిన తప్పు’ అన్నాడు. అతడి నోటి నుంచి అంత ఘోరమైన మాట వినాల్సి వచ్చింది.

పాప పోయాక..!
ఒక ఎంఎల్‌ఏ తన నియోజకవర్గంలో ఉన్న వారికి న్యాయం చేయాలి కదా! కానీ నాకు ఏ మాత్రం న్యాయం చేయలేదు. పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు పది లక్షలు ఇస్తామంటున్నారు. పోయిన డబ్బు సంపాదించుకోవచ్చు. కాని పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా. మా కార్పొరేటర్‌ కూడా కనీసం పట్టించుకోలేదు. ఎక్కడో తెలంగాణలో ఉన్న కెటిఆర్‌ మెసేజ్‌ పెట్టారు. నా మాజీ భర్త ఒక రౌడీ షీటర్‌. పాపకు ఆయన ఇంత అన్యాయం చే సినా ఆయనను అరెస్ట్‌ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా ఇంటిని ఎవరో కబ్జా చేయిస్తే వారి చేత ఇల్లు ఖాళీ చేయించి ఇచ్చామని స్థానిక ఎంఎల్‌ఏ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన నియోజకవర్గంలో ఇల్లు కొనడమే మేం చేసిన పాపమా?

నన్ను బతికించు నాన్నా!
పాప అనగానే నాకు పాప తీసిన సెల్పీనే గుర్తుకు వస్తుంది. అసలు పాప సెల్ఫీ తీసినట్లు మాకు మరుసటిరోజు వరకు తెలియదు. ఆ తరవాత నాలుగు రోజులు సంతోషంగా ఉంది. ఐదో రోజుకి క్రిటికల్‌ అయిపోయింది.
– డాక్టర్‌ వైజయంతి

Advertisement

తప్పక చదవండి

Advertisement