కొత్త పుస్తకాలు | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Mon, Dec 5 2016 1:28 AM

sakshi literature and new books

అశ్శరభశరభ
 రచన: ఎన్నెస్ నారాయణ బాబు; పేజీలు: 62(ఎ 4 సైజ్); వెల: 150; ప్రతులకు: రచయిత, 8-2-310ఎ/77ఎ, ఇబ్రహీం నగర్, రోడ్ నం.10, బంజారాహిల్స్, హైదరాబాద్-34. ఫోన్: 9052950208
 ‘‘దక్షయజ్ఞం’లోని వీరభద్ర ఘట్టంలో ‘అశ్శరభశరభ’ నినాద ఘోష నాటకం పేరులోని ఆంతర్యాన్ని సూచిస్తుంది. ‘స్త్రీ పట్ల అమానవీయ చర్యలను నిరసించేలా ప్రేక్షకులను రంజింపజేయడం ధ్యేయంగా ఆమె యొక్క అంతఃచేతనని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది’’. ‘ఈ నాటకాన్ని చలనచిత్ర, టి.వి. స్క్రిప్ట్ ఫార్మాట్‌లోనే, చెరిసగమైన పేజీలో ఒక పక్క యాక్షన్, ఒక పక్క మాటలుగా’ ఇచ్చారు.
 
 క్షణ వీక్షణాలు
 రచన: పాలపర్తి ధన్‌రాజ్; పేజీలు: 112; వెల: 100; ప్రతులకు: రచయిత, 70-17ఎ-18/2ఎ, శశికాంత్ నగర్, కాకినాడ- 533103; ఫోన్: 9550593901
 ‘క్షణం- కాల ప్రమాణం, వీక్షణం- ఇంద్రియ లక్షణం. క్షణంలో జరిగిన దాన్ని వీక్షించి సమీక్షిస్తే- అదే క్షణవీక్షణం’. ‘పాత్రలు, వర్ణనలు, రసం, ధ్వని... ఈ సిద్ధాంతరాద్ధాంతాలేవీ లేకుండా’ ధన్‌రాజ్ రాసిన 100 ఒక పేజీ కథల సంకలనం ఇది. ‘ప్రస్తుతం ఉన్న స్పీడ్ యుగానికి తగ్గట్టుగా క్షణంలో అయిపోయే కథలు’ ఇవి.
 
 శ్రీకృష్ణదేవరాయలు
 రచన: యస్.డి.వి.అజీజ్; పేజీలు: 96; వెల: 100; ప్రతులకు: ఎస్.అబ్దుల్ అజీజ్, 46/634, బుధవారపేట, కర్నూలు-518002.
 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 13 వారాల పాటు ప్రసారమైన రేడియో నాటకం ఇది. భారతదేశంలో పేరెన్నికగన్న పాలకుల్లో ఒకరైన రాయల కాలంలో ‘రాచరిక వ్యవస్థ ఎలాంటిదో, నాటి సామాజిక పరిస్థితులు ఎలాంటివో, రాచరిక వ్యవస్థలో రాజులు, చక్రవర్తులు చివరిదశలో ఎలా అశాంతికి లోనయ్యేవారో’ ఇందులో చిత్రీకరించారు.
 
 రుద్రమదేవి
 రచన: పాటిబండ్ల బేబి కౌసల్య; పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: రచయిత్రి, 205, సాయికృప టవర్స్, 6వ లైను, కోబాల్టు పేట, గుంటూరు-2. ఫోన్: 9849799711
 ‘గణపతిదేవ చక్రవర్తి రూపురేఖల వర్ణనతో ప్రారంభమైన ఈ నవల, సందర్భానుసారం, ఆయా ప్రసిద్ధ చారిత్రక వ్యక్తుల గుణగణాలను, ప్రతాప విశేషాలను పాఠకుల మనోనేత్రానికి గోచరింప జేస్తుంది. ముఖ్యంగా రుద్రమదేవిని ఒకవైపు స్త్రీ మూర్తిగా చిత్రిస్తూనే, ఇంకోవైపు రుద్రమదేవుడుగా పురుషరూపంలో రాజ్యపాలన చేయడం అనే విషయాన్ని వర్ణించడం కత్తిమీది సాము!’

Advertisement
Advertisement