రేమా ధీమా

Biography of Rema Rajeshwari - Sakshi

బయోగ్రఫీ - రేమా రాజేశ్వరి

ఏ మనిషికైనా... తాను ఒక పని చేస్తున్నప్పుడు... అది ఇతరుల శ్రేయస్సు కోసమైతే ఒక ధీమా ఉంటుంది. అదే పని... తన సొంతానికైనప్పుడు తెలియని న్యూనత ఉంటుంది. రేమా చేస్తున్న పనులు సమాజహితం కోసం... అందుకే రేమా ఏ పనినైనా ఎంతో ధీమాగా చేయగలుగుతోంది.

రేమా రాజేశ్వరి ఎస్‌.పి.గా నేరాల దర్యాప్తు, వాటి పరిష్కారంతో సరిపెట్టుకోవడం లేదు, సమస్య మూలాలను తెగ నరుకుతోంది.

ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది, నిజమే. గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలనేది గొప్ప ఆలోచన. ఎంపీలంతా ఒక్కో గ్రామాన్ని తీసుకున్నారు. వాటి తీరు ఎలా ఉందనే నివేదిక ఇవ్వమంటే వెనకడుగు వేస్తారు. పోలీస్‌ దత్తత తీసుకున్న ఈ గ్రామం మాత్రం ధైర్యంగా ఛాతీ విరుచుకుని మరీ చూపించుకోగలిగినట్లు మారిపోయింది. ఇది పోలీస్‌ దత్తత గ్రామం అని గ్రామస్థులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

మా బడి పోలీస్‌ బడి అని చెప్పేటప్పుడు ఆ పిల్లల ముఖాలు వెలిగిపోతాయి. పెద్దయ్యాక పోలీస్‌ అవుతాం అంటారు ‘చోటా భీమ్‌’ను అనుకరిస్తూ. ఇది మహబూబ్‌ నగర్‌ జిల్లా, అడ్డాకుల గ్రామంలోని గవర్నమెంట్‌ స్కూల్‌. కార్పొరేట్‌ స్కూల్‌ని తలపిస్తుంటుందా పాఠశాల. గోడలకు చోటాభీమ్, టామ్‌ అండ్‌ జెర్రీ వంటి కామిక్‌ స్టోరీల ఆయిల్‌ పెయింటింగ్స్, స్కూల్‌లో టాయిలెట్‌లు, వాటర్‌ సప్లయ్, కరెంట్, కంప్యూటర్‌ ఉన్నాయి.

పోలీస్‌ బృందం టేకప్‌ చేసేనాటికి రాలిపోతున్న కప్పు, పెచ్చులూడిన గోడలతో ఉండేది. రిపేర్‌లు చేసి, రంగులు వేసి, ఫ్లోరింగ్‌ మార్చేసి, కొత్త గదులు కట్టించి మోడరన్‌ లుక్‌ తెచ్చేశారు. ఇదంతా ఎవరు చేశారంటే పిల్లల చూపులన్నీ అక్కడే ఫొటోలో ఉన్న ఎస్‌.పి. రేమా రాజేశ్వరి వైపు మరులుతాయి. అదేమాట ఆమెను అడిగితే... ‘క్రెడిట్‌ మొత్తం మా టీమ్‌లోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, కానిస్టేబుల్‌ బాలరాజులదే’ అన్నారు నవ్వేస్తూ.

అమ్మమ్మ చెప్పిన కథలు... తాను చూసిన వాస్తవాలు!
రేమా రాజేశ్వరి పుట్టింది కేరళ రాష్ట్రం మున్నార్‌ జిల్లా ఇడుక్కిలో. పశ్చిమ కనుమల్లో విస్తరించిన టీ తోటల్లో ఆమె బాల్యం పచ్చదనం మధ్య అచ్చమైన స్వచ్ఛదనంతో గడిచింది. తండ్రి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో, తల్లి టీచింగ్‌ ప్రొఫెషన్‌లో ఉన్నారు. వాళ్ల ఉద్యోగాలతో వాళ్లు బిజీగా ఉంటే రేమాను పెంచడంలో అమ్మమ్మ పార్వతి రోల్‌ కీలకమైంది. వేళకింత అన్నం పెట్టి, స్నానం చేయించి స్కూలుకి పంపి ఊరుకోలేదామె. రేమాలో భవిష్యత్తు మీద ఒక గురిని ఏర్పరిచింది. ఆమె చూసిన బ్రిటిష్‌ పాలకులను కథలుగా చెప్పేది.

కలెక్టర్‌ వేసవిలో మున్నార్‌కు వచ్చినప్పుడు సిబ్బంది చేసే హడావిడిని కళ్లకు కట్టేది. ‘నువ్వు కలెక్టర్‌ అవ్వాలి’ అని పదే పదే చెప్పేది. అమ్మమ్మ చెప్పింది సరే... ఆ గమ్యాన్ని చేరాలనే తపన పిల్లల్లో ఉంటేనే సాధ్యమవుతుందన్నప్పుడు ఆమె... ‘‘కేరళలో పిల్లలకు చదువుకోమని ఒకరు చెప్పాల్సిన పని ఉండదు. చదవడం తమ బాధ్యత అన్నట్లు ఉంటారు. స్కూలు పూర్తయ్యేలోపే ఏ కాలేజ్‌లో ఏకోర్సులో చేరాలనే ఆలోచనలతో ఉంటారు. పేరెంట్స్‌ వాళ్లను కొద్దిగా గైడ్‌ చేస్తే చాలు.

నేను స్కూల్‌ కోసం రోజూ పదిహేను కిలోమీటర్ల దూరం నడిచేదాన్ని. గ్రాడ్యుయేషన్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ పోలీస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీతోపాటు సివిల్స్‌కి ప్రిపేరయ్యాను. ఐఏఎస్‌ రాలేదు. ఐపీఎస్‌ వచ్చింది. అమ్మమ్మ చెప్పిన కథలు ఒక కారణం అయితే, నేను చిన్నప్పటి నుంచి చూసిన సమాజంలో మహిళలకు, పిల్లలకు, కామన్‌ మ్యాన్‌కు ఎదురయ్యే సమస్యలను తీర్చే అవకాశం ఐఏఎస్‌ అయితేనే∙సాధ్యం అనే నమ్మకం నాది. అందుకే మళ్లీ ప్రయత్నిద్దాం అనుకున్నాను. కానీ ఇంట్లో వద్దన్నారు. దాంతో ఐపీఎస్‌లో చేరిపోయాను. ఇడుక్కి నుంచి ఐపీఎస్‌ అయిన తొలి మహిళను నేనే’’ అన్నారు.

ఆపరేషన్‌ స్మైల్‌!
రేమా రాజేశ్వరి 2009 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. హైదరాబాద్‌లో ట్రైనింగ్‌. రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పని చేశారు. ఇప్పుడు జోగుళాంబ గద్వాల్‌ జిల్లా ఎస్‌పీగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌గా మొదలైన ఆమె కెరీర్‌ తెలంగాణ క్యాడర్‌లో కొనసాగుతోంది.

కృష్ణా పుష్కరాల నిర్వహణలో తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టారు రేమా. సైబరాబాద్‌ డి.సి.పిగా ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడానికి షీ టీమ్‌లో పని చేశారీ బ్రేవ్‌ సూపర్‌ కాప్‌. రంగారెడ్డి జిల్లాలో ‘ఆపరేషన్‌ స్మైల్‌’ ప్రోగ్రామ్‌లో వలస వచ్చిన బాల కార్మికులను బడిబాట పట్టించారు. ‘సేవింగ్‌ చైల్డ్‌ బ్రైడ్‌’ క్యాంపెయిన్‌ చేపట్టి నాలుగు వందల మంది అమ్మాయిలను బాల్య వివాహాల నుంచి విముక్తి కలిగించారు. వాళ్ల పేరెంట్స్‌కి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ అమ్మాయిలను మళ్లీ బడిలో చేర్పించారు.

సీనియర్‌ సిటిజెన్‌ సర్వీసులు!
ఎస్‌పీగా ఆమె శాంతి భద్రతల నిర్వహణ, ప్రమాదాల నిర్వహణ, నేరాల దర్యాప్తుకు పరిమితం కావడం లేదు. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. వాటి మూలాలను నిర్మూలించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని నమ్మారామె. ఫ్యామిలీ రిలేషన్‌ ప్రోగ్రామ్‌ పెట్టారు. టీచర్లు, ఇతర ఉద్యోగాలలో రిటైర్‌ అయిన సీనియర్‌ సిటిజెన్‌ను ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వాములను చేశారు.

పోలీసులు ప్రతి కాలనీకి వెళ్లి ప్రమాదాల మీద అవేర్‌నెస్‌ తీసుకురావడం అయ్యే పని కాదు. అందుకే పట్టణంలోని సీనియర్‌ సిటిజెన్‌ని సమీకరించి వారి చేత కాలనీ వాసులకు చెప్పించేవారు. ఇది మంచి ఫలితాలనిచ్చింది. వేగం తాత్కాలికంగా ఆనందాన్నిస్తుందేమో కానీ ప్రమాదం జరిగితే కుటుంబం తల్లకిందులవుతుందని పెద్దవాళ్లు చెప్తుంటే విన్నవాళ్లలో పరివర్తన రాక మానుతుందా? అదే ఆమె టచ్‌ చేసిన పాయింట్‌.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో!
పోలీస్‌ యూనిఫామ్‌ కనిపిస్తేనే ఆమడదూరం పారిపోతారు గ్రామాల్లో. చిన్న సమాచారం సేకరించాలన్నా తలకు మించిన పని అవుతుంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా పోలీస్‌ దగ్గరకు రావడానికి భయపడుతుంటారు. అలాంటిది రేమా గ్రామస్తుల్లో ఒకరిగా కలిసిపోయారు. వారితోపాటు బతుకమ్మను మోశారు, పాట పాడుతూ ఆట ఆడారు. గ్రామీణ మహిళల్లో తమ కష్టాన్ని తీర్చడానికి ఒక ఆలంబన ఉందనే భరోసా కలిగించారు.

జోగినులకు కొత్త జీవితాన్నివ్వడం, దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేయడం, పిల్లలకు, మహిళలకు ఎదురయ్యే సమస్యల మూల కారణాల మీద కొరడా ఝళిపించడం వంటివన్నీ తొలి దశాబ్దంలోనే సొంతం చేసుకున్నారు. ఇందుకు ఆమె విస్తృతంగా సాహిత్యాన్ని చదవడమూ ఒక కారణమే. తమిళ, మలయాళ, తెలుగు, పంజాబీ, ఇంగ్లిష్, హిందీ భాషలు మాట్లాడతారామె. ఏ భాష సాహిత్యమైనా సరే ఆ కథల్లో ఇతివృత్తం కానీ, ప్రధాన సమస్యలు, సంఘటనలు అన్నీ పిల్లలు, స్త్రీల చుట్టూనే ఉండేవి.

ఏ సమాజమైనా బాధితులు స్త్రీలు, పిల్లలే అని అర్థమైంది. అందుకే ఆమె డిజైన్‌ చేసిన ప్రోగ్రామ్‌లన్నీ మహిళలు, కుటుంబాల శ్రేయస్సు కోరుతూ ఉంటాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను భుజానికెత్తుకుని గురి తప్పని షూటర్‌లా వాటిని లక్ష్యాలకు చేరుస్తుంది.

ఐపీఎస్‌ అయినప్పటికీ నా దృష్టి ఎప్పుడూ సామాజికాంశాల మీదనే లగ్నమవు తుంటుంది. సివిల్‌ సర్వెంట్‌గా సోషల్‌ ఇష్యూస్‌ని పరిష్కరించే దారులనే వెతుకు తుంటాయి నా కళ్లు. నాకు నచ్చిన దృశ్యాన్ని కెమెరాలో క్యాప్చర్‌ చేయడం, నా దృష్టికి వచ్చిన విషయాన్ని రాయడం నాకు ఇష్టమైన వ్యాపకాలు. వీలు చేసుకుని మరీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేపర్‌లో వ్యాసాలు రాస్తుంటాను.  ఇక నాకు ఇప్పటికీ మిగిలిపోయిన కోరిక హార్వర్డ్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ చేయాలనేది.

నా పిల్లలతో మాట్లాడించండి!
అది వేసవి కాలం, సోమవారం, గ్రీవెన్సెస్‌డే. ఓ ముప్పై ఏళ్ల మహిళ దైన్య స్థితిలో వచ్చింది. గట్టిగా గాలి వీస్తే పడిపోతుందేమో అన్నంత బలహీనంగా ఉంది. ఆమె తన కష్టం చెప్పుకోవడానికి ముందు గతాన్ని చెప్పింది. ఆమె 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్లు స్కూలుకు వచ్చారు, ఆమెను స్కూలు నుంచి నేరుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. మేనమామతో పెళ్లి అని అప్పుడు తెలిసింది. మేనమామ తనకంటే పన్నెండేళ్లు పెద్దవాడు, అంతేకాదు అతడికి అప్పటికే పెళ్లయింది.

అయినా తనతో మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. తన అమ్మానాన్నలే ఆ పెళ్లి చేస్తున్నారు. ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే పెళ్లి చేసేశారు. పెళ్లి కాగానే భర్త ఆమెను మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే తాను ఉద్యోగం చేసే టౌన్‌కు తీసుకెళ్లాడు. తొలి భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకి పిల్లలు లేనందువల్ల ఈమెను పెళ్లి చేసుకున్నాడు. కేవలం పిల్లలకోసమే. పిల్లలను కనడమే ఆమె చేయాల్సిన పని అన్నట్లే వ్యవహరించాడా భర్త. చీకట్లో భర్త దేహానికి తగలడం తప్ప అతడితో ఇంకే బాంధవ్యమూ పెరగలేదామెకు.

పెంచుకోవడం అతడికీ ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి ఆమెను పూర్తిగా వంటగదికి పరిమితం చేశారు. చివరికి ఆమె పిల్లలను కూడా ఆమెకు చూపించకుండా కట్టడి చేశారు. ఆ పరిస్థితిలో ఆమె పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. ‘నా పిల్లలతో ఒక్కసారి మాట్లాడించండి’ అని కళ్లనీళ్లు పెట్టుకుంది. ఆమె భర్త, అతడి మొదటి భార్యను అదుపులోకి తీసుకుని ఆమె పిల్లలను దగ్గర చేయడంతోపాటు జీవితానికి భరోసా కల్పించారు రేమా.

అప్పుడామెను ‘ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఎందుకు కంప్లయింట్‌ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న స్టేషన్‌ను వదిలిపెట్టి ఎస్‌పీ ఆఫీస్‌కు ఎందుకొచ్చావు?’ అని అడిగారు రేమా. అందుకామె చెప్పిన సమాధానం ఒక్కటే... ‘ఆడవాళ్లకైతేనే ఆడవాళ్ల కష్టం తెలుస్తుందని, ఇంకా మగ పోలీసుల నుంచి వచ్చే ప్రమాదాలుండవని’ చెప్పింది. ‘పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో మహిళల సంఖ్య పెరగాలని తాను ఇస్తున్న నివేదికకు ఇలాంటి సంఘటనలన్నీ కారణమే. అందుకే సెక్యూరిటీ ఫోర్సెస్‌లో కూడా జెండర్‌ ఈక్వాలిటీ ఉండా’లంటారు రేమా రాజేశ్వరి.

పున్నమి వెన్నెల
రేమా రాజేశ్వరి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్‌పీగా ఉన్నప్పటికీ ఊటుకూరు గ్రామ ప్రాంతంలో జోగినీ వ్యవస్థ కొనసాగుతూనే ఉండేది. రూపుమాసిపోయిందనుకున్న దురాచారం కళ్ల ముందే కనిపిస్తుంటే దానిని నిర్మూలించి తీరాలని నిర్ణయించుకున్నారామె. ‘పున్నమి వెన్నెల’ ప్రోగ్రామ్‌తో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మొత్తం 36 మంది జోగినులకు కొత్త జీవితాన్నిచ్చారు. టైలరింగ్‌లో రెండు నెలలు ట్రైనింగ్‌ ఇప్పించి, వారందరికీ మెషీన్లు అందజేశారు.

చిన్నప్పటి నుంచి చూసిన సంఘటనలు ఆమెకు సమాజంలో హానికి గురవుతున్నది మహిళలు, పిల్లలేనని చెప్తున్నాయి. తాము దోపిడీకి గురవుతున్నామని తెలుసుకోలేని అమాయకత్వం కూడా బలంగానే రాజ్యమేలుతోందనీ తెలుస్తోంది. దాంతో ‘గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌’ గురించి పిల్లలను చైతన్యవంతం చేయడాన్ని కూడా చాలా ఇష్టంగా చేపట్టారామె.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని  ప్రతి హైస్కూల్‌లోనూ ఈ ప్రోగ్రామ్‌ చేశారు. పాంప్లెట్లు, పోస్టర్‌లు వేశారు. షార్ట్‌ ఫిల్మ్‌లు చిత్రీకరించి స్కూళ్లలో ప్రదర్శించారు. అనేక స్కూళ్లకు ఆమె స్వయంగా వెళ్లి ఆడపిల్లలతో మాట్లాడారు. అసహజమైన స్పర్శను ఉపేక్షించరాదని, టీచర్లకు, అమ్మకు చెప్పి తీరాలని, ఆ ధైర్యాన్ని పెంచుకోవాలని చెప్పేవారామె. అడ్డాకులను నూరు శాతం టాయిలెట్‌లున్న గ్రామంగా తీర్చిదిద్దారు.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top