పదం పలికింది – పాట నిలిచింది

Bhanumathi song in sakshi literature - Sakshi

చిరుగాలి తరగలా చిన్నారి పడవలా
సినిమా పాటకు ఒక గౌరవప్రదమైన స్థాయిని కల్పించిన కవుల్లో మేటి, దేవులపల్లి కృష్ణశాస్త్రి. 1951లో విడుదలై, మునుముందు ఆణిముత్యంగా నిలువబోయే ‘మల్లీశ్వరి’ చిత్రం కోసం కృష్ణశాస్త్రే అన్ని పాటలూ రాయాలని కోరుకున్నారు దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి. నిదానంగానే అయినా ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు’, ‘మనసున మల్లెల మాలలూగెనే’ లాంటి గొప్ప పాటలు రాశారు దేవులపల్లి.

అందులోని, ‘ఎందుకే నీకింత తొందర/ ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే’ పాటలోని చివరి పాదాలైన ‘చిరుగాలి తరగలా చిన్నారి పడవలా/ పసరు రెక్కలు పరచి పరువెత్తి పోదాము’ గొప్ప ఊహాశాలీనతకు నిదర్శనం. సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని చిత్ర నాయిక భానుమతే పాడారు. తెరపై భానుమతితో పాటు టి.జి.కమలాదేవి కూడా కనిపిస్తారు.

గ్రేట్‌ రైటర్‌
ఫ్యోదర్‌ దోస్తోవ్‌స్కీ

ప్రపంచ సాహిత్యంలో ఒక గొప్ప సైకాలజిస్టుగా ఫ్యోదర్‌ దోస్తోవ్‌స్కీ (1821–1881) కీర్తినొందాడు. మాస్కోలో జన్మించిన దోస్తోవ్‌స్కీ 19వ శతాబ్దపు రష్యా సంక్లిష్ట రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక వాతావరణంలో మనిషి అంతరంగాన్ని అన్వేషించాడు. రచయితే ఏకస్వరంగా (Monologising) రచన అంతటా వినిపించడం కాకుండా, ప్రతి పాత్రా తనదైన భిన్న స్వరాన్ని (్కౌ ypజిౌnజీఛి) కలిగివుండే తరహా నవలా సృష్టికర్త దోస్తోవ్‌స్కీ అని మిఖాయిల్‌ బఖ్తిన్‌ అభివర్ణించాడు. రష్యా చక్రవర్తిని (జార్‌) విమర్శించే పుస్తకాల గురించి చర్చించిన బృందంలో ఒక సభ్యుడిగా దోస్తోవ్‌స్కీకి మరణ శిక్ష పడింది. దాని అమలులో భాగంగా, 1849 డిసెంబర్‌ 23న ఆయన్ని కాల్చిచంపబోయే చివరి నిమిషంలో శిక్షలో మార్పు జరిగింది. అలా సైబీరియాలో నాలుగేళ్ల కఠిన కారాగారశిక్ష అనుభవించాడు. ఆ తర్వాతే దోస్తోవ్‌స్కీ అనగానే గుర్తొచ్చే ‘నోట్స్‌ ఫ్రమ్‌ అండర్‌గ్రౌండ్‌’, ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’, ‘ది ఇడియట్‌’, ‘ద బ్రదర్స్‌ కరమ్‌జోవ్‌’, ‘డీమన్స్‌’ లాంటి సుప్రసిద్ధ రచనలు వెలువరించాడు. ఆ శిక్షలో మార్పు జరగకపోయివుంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top