
వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ కాలుష్యం తగ్గితే అనేక రకాల వ్యాధుల వ్యాప్తి తగ్గి ప్రాణాలు నిలుస్తాయని మన అందరికీ తెలుసు. అయితే భూతాపోన్నతికి కారణమవుతున్న ఈ వాయు కాలుష్యాన్ని ఎంతమేరకు తగ్గిస్తే ఎన్ని ప్రాణాలను కాపాడవచ్చు అన్న అంశాన్ని తొలిసారి డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. వారి అంచనా ప్రకారం భూమి ఉష్ణోగ్రతలు ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీల కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోగలిగితే దాదాపు 15.3 కోట్ల మంది అకాల మృత్యువు బారిన పడకుండా చూడవచ్చు. ప్రపంచంలోని 154 పెద్దపెద్ద నగరాల్లో గాలిలో కలుస్తున్న కార్బన్డయాక్సైడ్ మోతాదును వేగంగా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరు స్పష్టం చేస్తున్నారు.
మనదేశ రాజధాని ఢిల్లీ, కోల్కతాల్లో మాత్రమే దాదాపు 44 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చునని, ఆసియా, ఆఫ్రికాల్లోని ఇంకో 13 నగరాల్లో పది లక్షల మందిని కాపాడవచ్చునని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రస్తుత కర్బన ఉద్గారాలు.. భవిష్యత్తు అంచనాల ఆధారంగా తాము కంప్యూటర్ సిములేషన్లు నడిపామని వీటివల్ల మానవులకు వచ్చే వ్యాధులు ఎంతమేరకు పెరుగుతాయి? తద్వారా ఎంతమంది అకాల మృత్యువు బారిన పడతారో? అంచనా కట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షిండెల్ తెలిపారు.