మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం ఊపందుకుంటోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ పార్టీ నాయకులు, అనుచరగణంతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాండూరు, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం ఊపందుకుంటోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ పార్టీ నాయకులు, అనుచరగణంతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా విందు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. కౌన్సెలర్లుగా ఆయా వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు తడిసిమోపడవుతోంది. దీంతో అభ్యర్థులు హడలెత్తిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో వెంట తిరిగే అనుచరగణంతోపాటు నాయకులకు బిర్యానీలు, మద్యం పంపిణీకి అభ్యర్థులకు రోజువారీగా రూ.30వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికితోడు ఉదయం నిద్ర లేవక ముందే ఇంటి వద్ద ఆయా వార్డులకు చెందిన ఓటర్లు వాలిపోతున్నారు.
ఇంట్లో పరిస్థితి బాగా లేదని.. పిల్లలు జబ్బుతో బాధపడుతున్నారని ఇలా రకరకాల కారణాలతో డబ్బుల కోసం ఓటర్లు అభ్యర్థుల ఇంటి చుట్టూ తిరుగుతుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా వెంట తిరుగుతున్న మద్దతుదారులను సంతృప్తి పర్చడానికి డబ్బులు నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఈ ఖర్చులకు జడిసి కొన్నిసార్లు ముఖం చాటేయాల్సి వస్తోంది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 31 వార్డుల్లో విందు రాజకీయాలు అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పోలింగ్కు మరో తొమ్మిది రోజుల సమయం ఉందని, ఇప్పుడే ఖర్చు తడిసి మోపడవుతుండటంపై అభ్యర్థులు కలవరపడుతున్నారు.