ఫ్యాను గాలితో ప్రజలకు ప్రశాంత జీవితం | Guntur Parliament constituency candidate Vallabhaneni balasauri Nomination | Sakshi
Sakshi News home page

ఫ్యాను గాలితో ప్రజలకు ప్రశాంత జీవితం

Apr 18 2014 1:15 AM | Updated on Aug 24 2018 2:33 PM

ఫ్యాను గాలితో ప్రజలకు ప్రశాంత జీవితం - Sakshi

ఫ్యాను గాలితో ప్రజలకు ప్రశాంత జీవితం

రాష్ట్రంలో ప్రజలు చల్లని ఫ్యాను గాలితో ప్రశాంతంగా జీవించే సమయం మరో నెల రోజుల్లో రానుందని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ

విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ :రాష్ట్రంలో ప్రజలు చల్లని ఫ్యాను గాలితో ప్రశాంతంగా జీవించే సమయం మరో నెల రోజుల్లో రానుందని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. గురువారం్ల కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.  నామినేషన్‌కు తరలివచ్చిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు జాగ్రత్తగా తమ నివాసాలకు వెళ్ళాలని కోరారు.  ప్రతి గ్రామానికి వెళ్లానని, ప్రజలు పడుతున్న బాధలు చూశానని చెప్పారు. ప్రజలను ఆ బాధల నుంచి విముక్తులను చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరుని ఆశయాలతో ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారన్నారు.
 
 నేడు నగరంలో జనసంద్రాన్ని చూస్తుంటేనే పార్టీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో తెలుస్తుందన్నారు. చంద్రబాబు ప్రవర్తన ప్రజలకు అర్థమమయ్యే ఉంటుందని,  తెలంగాణలో పొత్తు ఉందని నామినేషన్లు పూర్తయి స్క్రూట్నీ సమయంలో ప్లేటు ఫిరాయించారన్నారు. ప్రస్తుతం సీమాంధ్ర పరిస్థితి కూడా అంతే ఉందన్నారు. బీజేపీకి మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికార దాహంతో ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ప్రజలకు మాయమాటలు చెబుతున్నారన్నారు. పార్టీ ఏర్పాటయిన నాటినుంచి నేటి వరకూ మాటకు కట్టుబడిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్నారు. సీమాంధ్ర అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని,  గుంటూరును ఐటీ హబ్‌గా మార్చి, ప్రతి కుటుంబంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తానన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని తెలిపారు.  ఫ్యాను గాలి విసృ్తతంగా వీస్తోందని, ఈ ప్రభంజనానికి కొన్ని పార్టీలు కొట్టుకుపోనున్నాయన్నారు.
 
 చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులకు వచ్చేనెల 7న ప్రజలు బుద్ధి చెప్పనున్నారన్నారు.  కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(మంగళగిరి), మేకతోటి సుచరిత(ప్రత్తిపాడు), లేళ్ళ అప్పిరెడ్డి(గుంటూరు పశ్చిమ), మొహమ్మద్ ముస్తఫా(గుంటూరు తూర్పు), రావి వెంకటరమణ(పొన్నూరు), కత్తెర క్రిష్టినా(తాడికొండ), అన్నాబత్తుని శివకుమార్(తెనాలి), పార్టీ యువజన విభాగం  జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, థామస్‌నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ షౌకత్, నసీర్ అహ్మద్, గులాంరసూల్, కిలారి రోశయ్య, విజయసారధి, రాతంశెట్టి సీతారామాంజనేయులు(లాలుపురంరాము), పులగం శివరామిరెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, కిక్కురు అర్లారెడ్డి, డొక్కు కాటం రాజు, రాజరెడ్డి సాంబశివరావు, షేక్ సలీం, కలేసా, యోగేశ్వరరెడ్డి, నడవ వీరయ్య, సాంబిరెడ్డి, ఎన్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement