ప్రచార జోరు | election campaign start from today | Sakshi
Sakshi News home page

ప్రచార జోరు

Apr 14 2014 1:51 AM | Updated on Sep 2 2017 5:59 AM

సార్వత్రిక ఎన్నికల వేడి జోరందుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత జరుగుతున్న ప్రథమ ఎన్నికలను ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల వేడి జోరందుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత జరుగుతున్న ప్రథమ ఎన్నికలను ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రచార హోరుతోపాటు పార్టీల్లో చేరికల జోరును నాయకులు ఉధృతం చే స్తున్నారు. దీంతో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ వరకు జరిగిన ప్రహసనం ఒక కొలిక్కి రావడంతో నేతలు తర్వాతి తంతుపై దృష్టిసారించారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో 25 బరిలో ఉండగా, పది అసెంబ్లీ స్థానాలకు 107 మంది పోటీలో ఉన్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి దాదాపు 12 మంది పోటీ పడుతుండగా, ఒక్కో అసెంబ్లీ స్థానానికి దాదాపు పది మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలోని 19.18 లక్షల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వివిధ పార్టీల అభ్యర్థులు బిజీగా ఉన్నారు.

 అభ్యర్థుల సుడిగాలి పర్యటన
 పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి జి.వివేక్ తన పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి జి.అర వింద్‌రెడ్డిని వెంటబెట్టుకొని కాంగ్రె స్ నుంచి చేరికలు ప్రోత్సహిస్తున్నారు. సదరు నేతలిద్దరూ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. సొంత గూటికి చేరిన ఆ ఇద్దరు నాయకులు టీఆర్‌ఎస్ శ్రేణులకు గాలం వేయడమే లక్ష్యంగా చేరికల జాతర చేస్తున్నారు. సిర్పూర్ నుంచి బరిలో ఉన్న కె.ప్రేంసాగర్‌రావు చేరికలతో కాంగ్రెస్‌ను బలోపేతం దిశగా ముందుకు సాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మిని హస్తం గూటిలో చేర్చగలిగారు.

ఇదిలాఉండగా అసంతృప్తులున్నచోట నాయకులు బుజ్జగింపుల పర్వాన్ని తెరమీదకు తెస్తున్నారు. బరిలో నిలవాలని నామినేషన్లు దాఖలు చే సి వెనక్కు తీసుకున్న వారిని ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి ప్రభావిత ఓట్లను పొందే దిశగా ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి భార్గవ్ దేశ్‌పాండే కృషిచేస్తున్నారు. ఇక వైఎస్సార్ సీపీ నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపించాలని కోరుతున్నారు.టీడీపీ, బీజేపీ పొత్తుల  ఫలితాన్ని పొందేందుకు ఆ రెండు పా ర్టీల నేతలు కృషి చేస్తున్నారు. ఇంకా బీజేపీ, టీడీపీ, సీపీఐ, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు వేయాలని కోరుతున్నారు.

 ప్రచార హోరు.. విమర ్శల జోరు..
 నాయకుల ఎన్నిక ల ప్రచారంలో ప్రజాసంక్షేమ అంశాల కంటే వ్యక్తిగత దూషణలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ రకమైన ధోరణి ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాప్యానికి, అమరుల బలిదానాలకు కాంగ్రెస్ అగ్రనేతలే కారణమని గులాబీ దండు దుమ్మెత్తిపోస్తోంది. ప్రచారంలో భాగంగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న నేతలు గ్రామాల్లో సాయంత్రం ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఓటు అభ ్యర్థిస్తున్నారు. కాగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అధినాయకులను రప్పించి బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు అభ్యర్థుల సతీమణులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వెరసి సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement