
కాంగ్రెస్, టీఆర్ ఎస్ లు 'పైకి కుస్తీ, లోపల దోస్తీ'?
తెలంగాణలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ లు ఎన్నికల బరిలో ముఖాముఖీ పోరుకు తలపడుతున్నాయి. కానీ తెరవెనుక ఒకదానికొకటి కన్ను గీటుకుంటున్నాయా?
తెలంగాణలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ లు ఎన్నికల బరిలో ముఖాముఖీ పోరుకు తలపడుతున్నాయి. కానీ తెరవెనుక ఒకదానికొకటి కన్ను గీటుకుంటున్నాయా? ఇరు పార్టీల మధ్య తెలియని అవగాహన ఏదో ఉందా? తెలంగాణలో ఇరు పార్టీలు టికెట్లు ఇచ్చుకున్న పద్ధతిని చూస్తే అసలు ప్లేయర్లకు ఆటలో అరటిపండ్లను పోటీకి పెట్టుకుంటున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.
ఉదాహరణకి కేసీఆర్ పోటీచేస్తున్న మెదక్ పార్లమెంటరీ సీటుకు వాస్తవానికి విజయశాంతిని పోటీ పెట్టాల్సింది. కానీ ఆమెను మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీకి దింపి, కేసీఆర్ కు లైన్ క్లియర్ చేశారు. దీనికి బదులుగా నిజామాబాద్ రూరల్ సెగ్మెంటులో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ కు టీఆర్ ఎస్ వాకోవర్ ఇచ్చింది. ఆయనపై గట్టి క్యాండిడేట్ ను పోటీలోకి దింపడానికి బదులు రెండు మూడు రోజుల క్రితమే టీఆర్ ఎస్ లో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ ఇచ్చింది. ఇదే విధంగా మంత్రి గీతారెడ్డికి మాణిక్ రావు వంటి బలహీన క్యాండిడేట్ ను పోటీలోకి దింపింది.
ఈ 'ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం' పాలసీని రెండు పార్టీలూ మిగతా నియోజకవర్గాల్లో కూడా కొనసాగించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 171 ఓట్ల మెజారిటీతో ఎలాగోలా సిరిసిల్ల నుంచి గెలిచిన కే టీ ఆర్ పై గట్టి క్యాండిడేట్ ను పెట్టాల్సిన కాంగ్రెస్ ఉట్టి క్యాండిడేట్ ను పెట్టింది. కాంగ్రెస్ క్యాండిడేట్ కె రవీందర్ రావు కి నియోజకవర్గంపై అంతగా పట్టు లేదన్నది ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్న మాట.
కాంగ్రెస్ దిగ్గజం, ప్రభుత్వ విప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తెలంగాణ కోసం చనిపోయిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బరిలోకి దింపడం, నర్సంపేటలో టీఆర్ ఎస్ నేత పెద్దిరెడ్డి సుదర్శన రెడ్డిపై లెక్చరర్స్ జాక్ నేత కత్తి వెంకట స్వామిని కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఆయనను బలహీనమైన అభ్యర్థిగా లెక్కవేస్తున్నారు.
మరి కొందరి విషయంలో పోటాపోటీ తప్పకపోయినా, ఓడిపోయిన వారిని రాజ్యసభ రూటు ద్వారా ఢిల్లీకి పంపాలని రహస్య ఒప్పందం కుదిరిందని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ లో పోటీ పడుతున్న టీఆర్ ఎస్ అభ్యర్థి, కెసీఆర్ తనయ కవిత, కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ విషయంలో ఇలాంటి ఒప్పందం ఉందని కథనాలు వినవస్తున్నాయి.
ఇవన్నీ 'పైకి రుసరుసలు, లోపల గుసగుస' విధానానికి నిదర్శనాలేనని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇప్పటి వరకూ రహస్యంగా ఉంచిన పొత్తు బట్టబయలు అవుతుందని వారంటున్నారు.