ఇద్దరు దొంగలు అరెస్ట్
జంగారెడ్డిగూడెం: దొంగతనాలకు పాల్పడే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై ఎం.కేశవరావు సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి..2015లో పట్టణానికి చెందిన పి.బాబ్జి ఇంట్లో చోరీ జరిగింది. వినాయకచవితి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆలయానికి వెళ్లగా తాళాలు పగులగొట్టి బంగారు, వెండి వస్తువులు చోరీ చేశారు. ఈ కేసుకు సంబంధించి పాత నిందితుడైన ద్వారకాతిరుమల మండం తూరల లక్ష్మీపురానికి చెందిన కోడూరి రవితేజ, బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడేనికి చెందిన గురుగుంట్ల రాజును అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి నాలుగు కాసుల బంగారు వస్తువులు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటిలో బంగారు గొలుసు, గాజులు, మూడు ఉంగరాలు, ముక్కు పుడుక ఉన్నాయని విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందన్నారు. కోడూరి రవితేజపై జంగారెడ్డిగూడెం, లక్కవరం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.