ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతోంది... | Parents anguish of childrens train accident | Sakshi
Sakshi News home page

ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతోంది...

Jul 24 2015 9:21 AM | Updated on Sep 3 2017 6:02 AM

ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతోంది...

ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతోంది...

రైలు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల వేదనకు నేటితో ఏడాది...

మాసాయిపేట రైలు దుర్ఘటన ఇంకా వెంటాడుతోంది. తల్లుల గర్భశోకాలు.. చిన్నారుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. దుర్ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఇస్లాంపూర్‌లో స్వామి, పుష్ప దంపతులు తమ కుమారుని ప్రతి రూపాన్ని (విగ్రహం) తయారు చేయించుకుని నిత్యం తమ కళ్లముందు ఉండేలా వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. మరో దంపతులు ఉన్న ఇద్దరు పిల్లలను కోల్పోయి ఊరును విడిచి పట్టణానికి వలస వెళ్లారు. ఇలా ఒక్కో బాధిత కుటుంబానిదీ ఒక్కో వ్యథ..
 
తీరని గర్భశోకం..
- చెరగని చిన్నారుల గుర్తులు
- కళ్ల ముందు కదలాడుతున్న చిన్నారుల జ్ఞాపకాలు
- మాసాయిపేట ఘటన జరిగి నేటికి ఏడాది
- బాధిత కుటుంబాల్లో తీరని వేదన
- స్మృతివనం ఏర్పాటయ్యేనా?


తూప్రాన్/వెల్దుర్తి: రైలు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల వేదనకు నేటితో ఏడాది. సరిగ్గా ఏడాది క్రితం రోజులాగే తెల్లారింది, ఎప్పటిలాగే ఆ చిన్నారులు  ఆడుతూ పాడుతూ స్కూల్‌కు బస్సులో బయలుదేరారు. మరో పది నిమిషాల్లో స్కూలుకు చేరుకునేలోపు... అటుగా వస్తున్న నాందేడ్ ప్యాసింజర్ రైలు... స్కూల్ బస్సును ఢీ కొట్టింది. ఇంకేముంది? కళ్లుమూసి తెరిచేలోపు బస్సు తుక్కుతుక్కైంది. అందులోని చిన్నారులు హాహాకారాలు చేస్తూ రైలు పట్టాల పక్కన ఎగిరిపడ్డారు. బస్సులో మొత్తం 34 మంది చిన్నారుల్లో ఉండగా డ్రైవర్, క్లీనర్‌తో పాటు 14 మంది చిన్నారులు సంఘటన స్థలంలో ఈ లోకాన్ని వదిలారు. మరో 20 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందారు.

వీరిలో ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం 16 మంది చిన్నారులు రైలు ప్రమాదంలో విగత జీవులయ్యారు. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద 2014 జులై 24న జరిగిన రైలు ప్రమాదం జరిగి నేటికి ఏడాది అవుతుంది. మృతులంతా తూప్రాన్ మండలానికి చెందిన ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 13 ఏళ్లలోపు వారే. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. రైల్వేగేటు లేకపోవడం, రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం.. వెరసి ముక్కుపచ్చలారని పసిమొగ్గల బంగారు భవిష్యత్తు గాల్లో కలిసింది. 

ఘటన స్థలంలో తల్లిదండ్రుల రోదనలు, బంధువుల వేదనలు.. స్థానికుల ఆందోళనలు.. రాజకీయ నేతల పరామర్శలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకరంగా మారిపోయింది. ఘటన స్థలమంతా మరుభూమిని తలపించింది. ఘటనా స్థలంలో విద్యార్థుల స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్స్‌లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. టిఫిన్ బాక్స్‌ల్లోని అన్నం మెతుకులు చిన్నారుల రక్తంతో తడిసి నెత్తుటి ముద్దలుగా కన్పించాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ప్రతి ఒక్కరు కన్నీరు పర్యంతమయ్యారు.
 
స్మృతివనం ఏర్పాటు చేయక..
ఈ సంఘటనతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర పార్టీల నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు పెట్టారు. ఘటనా స్థలం వద్ద పిల్లల జ్ఞాపకార్థం మూడు నెలల్లో స్మృతివనం ఏర్పాటు చేసి స్థూపాన్ని నిర్మిస్తామని మంత్రులు ప్రకటించారు. మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది గడుస్తున్నా నేటికి స్మృతివనం ఏర్పాటు చేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఇప్పటికైనా స్మృతివనం ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
 
రెండేళ్ల క్రితమే సాక్షి కథనాలు..
రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు లేకపోవడంతో ముంచుకొచ్చే ప్రమాదాలపై రెండేళ్ల నుంచి సాక్షి కథనాలు రాసింది. ఈ దుర్ఘటన కంటే ఆరు నెలల ముందు తూప్రాన్‌లోని ఓ ప్రవేటు పాఠశాలకు చెందిన బస్సు 30 మంది విద్యార్థులలో మాసాయిపేట నుంచి రైల్వే క్రాసింగ్ దాటే సమయంలో బస్సు చెడిపోయి పట్టాలపై ఆగిపోయింది. అప్పటికే శ్రీనివాసనగర్‌స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు కూతపెట్టుకుంటూ రావడంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి బస్సు నుంచి దిగుతుండగా గమనించిన రైలు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకు వేయడంతో పట్టాలపై ఉన్న బస్సుకు రెండు గజాల దూరంలో ఆగిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పిన ఆరు నెలల కాలంలోనే ఈ దుర్ఘటన జరిగింది.
 
అండర్ బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి..

శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్‌లో అండర్‌గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మిస్తామని పాలకులు హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా హామీగానే మిగిలింది. ఈ రైల్వే స్టేషన్‌లో ఉన్న రైలు పట్టాల మీదుగా ప్రజలు, విద్యార్థులు వందలాది మంది రైలు పట్టాలు దాటుతూ ఉంటారు. ఎప్పుడు  ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అర చేతిలో ప్రాణాలు పెట్టుకున్న పట్టాలు దాటుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, రైల్వే శాఖ అధికారులు   బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
నీటి సుడులు తిరుగుతూనే ఉన్నాయి...
బాధితుల మదిలోంచి చిన్నారుల జ్ఞాపకాలు చెదిరిపోలేదు. వారి మధుర జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇద్దరు పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం.. ఎదిగిన కొడుకును మరిచిపోలేక ఆ దంపతులు కుమారుని ప్రతి రూపాన్ని (విగ్రహం) తయారు చేయించుకుని నిత్యం తమ కళ్లముందు ఉండేలా తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఓ తల్లి తన పిల్లల లేరన్న సంఘటనను జీర్ణించుకోలేక మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.

మరో తల్లి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డ కూతురును ఆ వాతవరణం నుంచి దూరంగా పెంచేందుకు ఊరునే వదిలేశారు. మరో దంపతులు ఉన్న ఇద్దరు పిల్లలను కోల్పోయి ఉన్న ఊరును విడిచి పట్టాణానికి వచ్చి బతుకుతున్నారు. ఇలా బాధిత కుటుంబాలు మనో ధైర్యం కోల్పోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement