తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం ఉదయం మలయప్పస్వామివారు బద్రీనారాయణుడి రూపంలో భక్తులను సాక్షాత్కరించారు. బంగారు వాకిలిలో కొలువు, పంచాంగ శ్రవణం అనంతరం మలయప్పకు రంగనాయక మండపంలో విశేష సమర్పణ చేశారు. మంగళవాయిద్యాలతో ఆలయం వెలుపల వాహన మండపంలో స్వామివారు వేంచేపు చేశారు. పట్టుపీతాంబరం, మరకత మాణిక్యాదుల విశేష ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలతో స్వామివారిని అలంకరించారు. ఐదు శిరస్సుల శేషుడి నీడలో బద్రీనారాయుyì రూపాన్ని దాల్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు సాగింది. వాహన సేవలో ముందు గజరాజులు, అశ్వాలు, నందులు నడవగా, భజన, కళా బందాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీటీడీ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.