
కూలిన భవనం: ఐదుగురు మృతి
వైఎస్ఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనం కూలి ఐదుగురు మృతి చెందారు.
మైదుకూరు : వైఎస్ఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనం కూలి ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. మైదుకూరు మండలం ఉచ్చలవరం గ్రామానికి చెందిన అప్పన్నపల్లి చిన్న గురప్ప కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం వేకువజామున ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ సంఘటనలో చిన్నగురప్పతో పాటు ఆయన భార్య పెంచలమ్మ, కుమార్తె లలితతో పాటు యశ్వంత్, నవనీత్ అనే చిన్నారులు మృత్యువాతపడ్డారు. హరిత అనే మహిళతోపాటు మరో చిన్నారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నానిన పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
చిన్నగురప్ప కుటుంబంలోని ఐదుగురు మృత్యువాతపడడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. భవనం కూలిన విషయం గమనించిన స్థానికులు శిథిలాలను తొలగించి గాయపడిన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.