మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది.
మక్తల్: మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. మక్తల్ మండలం రుద్రవరం గ్రామంలో నేటి వేకువ జామున దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. చిన్న లింగప్ప(35), మణెమ్మ(30) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులు, వేట కొడవళ్లతో దాడిచేసి ఇద్దరినీ నరికి చంపారు.
పిల్లలను మాత్రం వదిలేశారు. గాలివాన బీభత్సం కారణంగా రాత్రంతా కరెంట్ లేదు. దాంతో దంపతుల హత్యను ఎవరూ గుర్తించలేకపోయారు. ఉదయం గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మక్తల్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే పక్కింటి వారితో ఉన్న చిన్న చిన్న గొడవల వల్లే హతమార్చి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారు.