ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతిచెందగా, 15మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆటో బోల్తా..మహిళ దుర్మరణం
Nov 29 2016 11:58 PM | Updated on Apr 3 2019 7:53 PM
- కూలి పనులకు వెళ్తుండగా ఘటన
- 15 మందికి స్పల్ప గాయాలు
మల్లికార్జునపల్లి(హాలహర్వి): ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతిచెందగా, 15మందికి స్వల్ప గాయాలయ్యాయి. చింతకుంట గ్రామం నుంచి మల్లికార్జునపల్లికి కూలీ పనులకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చింతకుంట గ్రామానికి చెందిన ఉలిగమ్మ(45) వ్యవసాయ కూలీ. మంగళవారం తోటి కూలీలతో కలిసి (మొత్తం 16) పత్తి విడిపించడానికి ఏపీ21వై 6314 నంబర్ గల ఆటోలో శిరుగాపురం గ్రామానికి ఉదయం 8 గంటలకు బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో మల్లికార్జున గ్రామసమీపంలో ప్రమాదవశాత్తు ఆటో ముందుచక్రం స్ప్రింగ్రాడ్ విరిగిపోయింది. దీంతో ఆటో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఉలిగమ్మ ఛాతీపై ఆటో ట్రాలీ పడటంతో శ్వాస ఆడక ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా 15 మంది కూలీలకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హాలహర్వి ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉలిగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త గాదిలింగప్ప, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విలేకరులకు చెప్పారు.
Advertisement


