అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం | adivasi festival Richly | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం

Aug 9 2016 8:14 PM | Updated on Oct 1 2018 6:33 PM

అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం - Sakshi

అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమష్టి జీవన పద్ధతులు, పారదర్శకతకు నిలువెత్తు సాక్ష్యాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.

విశాఖ–కల్చరల్‌ : ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమష్టి జీవన పద్ధతులు, పారదర్శకతకు నిలువెత్తు సాక్ష్యాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివాసీల సమాజానికి మూలవాసులులాంటి వారన్నారు.  22వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని  ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ అసెంబ్లీ హాల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. ఏయూ క్యాంపస్‌ గిరిజన విద్యార్థుల సంఘం, గిరిజన పరిశోధకులు, ట్రైబల్‌ టీచింగ్, నాన్‌టీచింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ సంబరాలు అంబరాన్నింటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏయూ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.నాగేశ్వరరావు మాట్లాడారు. గిరిజన యువత చదువుకొని ఉపాధిని పొందిన తర్వాత తమ సమాజం వైపు కన్నెత్తి చూడటం లేదని..ప్రతి వ్యక్తి తమ మూలాలను మర్చిపోవద్దని సూచించారు. జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ ప్రపంచంలో నీతి, నిజాయతీ గల మనుషులెవరంటే ఆదివాసీ ప్రజలేనన్నారు. రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఇ.ఎ.నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలను తప్పుదొవ పట్టించి గిరిజనుల వనరులను దోచుకొనే ప్రయత్నాలను గిరిజనులు తిప్పికొట్టాలన్నారు. సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి మాట్లాడుతూ రక్షణ కవచంలాంటి చట్టాలు, ఆదివాల చరిత్ర, హక్కులను భవిష్యత్తు తరాలకు చాటిచెప్పాల్సిన బాధ్యత గిరిజన యువతపై ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల సంపదను దోచుకోవడానికి భూస్వామ్య వర్గాలు మభ్యపెడుతుందని విమర్శించారు. ఉన్న కొద్దివనులునైనా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏయూ తెలుగు విభాగం ఆచార్య జె. అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో ఏయూ రిజిస్ట్రార్‌ వి.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె. రవిబాబు, ప్రొఫెసర్లు ఎస్‌. ప్రసన్నశ్రీ, టి. సుబ్బరాయుడు,వీవీఎస్‌ ప్రసాదరావు, గిరిజన స్కాలర్స్‌ టి. జగత్‌రావు, బలరామ్, సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు వంగపండు,ఉదయ భాస్కర్‌లు ఆలపించిన పలు ప్రజా గేయాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ‘థింసా’15వ వార్షిక మాసపత్రికను ఏయూ వీసీ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా గిరిజన పరిశోధకులు, ఏయూ గిరిజన అచార్యలు కలిసి వీసీ నాగేశ్వరరావును, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ ఘనంగా సత్కరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement