104 ఉద్యోగుల ఆందోళన
కాకినాడ సిటీ :
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రన్న సంచార చికిత్స(104) కాంట్రాక్ట్, ఔట్ సోర్శింగ్ ఉద్యోగులు గురువారం ఆందోళన నిర్వహించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న సంచార వాహనాలతో ఉద్యోగులు మందుల కోసం కాకినాడలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్కు వచ్చారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ముందుగా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి ప్లకార్డులతో ర్యాలీగా పాతబస్స్టాండ్, జిల్లా పరిషత్ సెంటర్, రామారావుపేట మీదుగా డీఎంహెచ్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఐదు నెలల వేతన బకాయిలు విడుదల చేయాలని, 2015 సెప్టెంబర్ నుంచి 2016 మార్చి వరకు వాహన సిబ్బందికి బకాయి ఉన్న పుడ్ అలవెన్స్, రిజర్వు స్టాఫ్కు 2015 జూలై నుంచి 2016 మార్చి వరకు టీఏ, డీఏ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శి కేపీ నాయుడు, సీఐటీయూ నాయకులు సీహెచ్.రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.