
చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం
సాక్షి, పులివెందుల : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం.. చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. గురువారం ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్రూంలో రక్తపు మడుగులో పడిఉండటాన్ని పనివారు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన అకాల మరణంపై అనుమానం వ్యక్తం అవుతోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందుల్లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. (నిన్న కూడా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా)