ప్రత్యూషది ఆత్మహత్య కాదు...హత్యే: కిషన్‌రావు

woman commits suicide in alwal, father blames in-laws - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అల్వాల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత ప్రత్యుష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన అల్లుడు శశికాంత్‌రావే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుషకు అల్వాల్‌ న్యూ రెడ్డి ఎన్‌క్లేవ్‌కు చెందిన శశికాంత్‌రావు అలియాస్‌ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్‌ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టచెప్పాడు. అయితే మళ్లీ కొద్దిరోజులుగా భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో ప్రత్యుష బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తన కుమార‍్తెది హత్యేనని, ఆత్మహత్య కాదని చెబుతున్నారు. ఆరేళ్ల నుంచి తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శశికాంత్‌రావు గతంలో బినామీలు పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కృష్ణారెడ్డి భూమిని లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడని కిషన్‌రావు తెలిపాడు. ప్రత్యుష అనుమానాస్పద మృతితో పాటు, శశికాంత్‌రావు కబ్జాలపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top