కామాంధుడితో కాంప్రమైజ్‌..! | UP Woman Commits Suicide After Police Pressure To Compromise | Sakshi
Sakshi News home page

కామాంధుడితో కాంప్రమైజ్‌కు నో.. బాధితురాలు ఆత్మహత్య

Aug 31 2018 7:03 PM | Updated on Aug 31 2018 7:07 PM

UP Woman Commits Suicide After Police Pressure To Compromise - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కేసు నమోదు చేయలేమనీ, వినయ్‌కుమార్‌తో కాంప్రమైజ్‌ కావాలని ఒత్తిడి తెచ్చారు. పోలీసుల వ్యవహారంతో..

షాజహాన్‌పూర్‌ : అఘాయిత్యం జరిగింది మహాప్రభో న్యాయం చేయండని వేడుకున్న ఓ మహిళను రక్షకభటులు చిన్నచూపు చూశారు. కేసు నమోదు చేయకపోగా.. రేప్‌ చేసిన కామాంధుడితో కాంప్రమైజ్‌ కావాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లోనే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్త రామ్‌వీర్‌ తెలిపిన వివరాలు.. షాజహాన్‌పూర్‌లో నివాసముండే సుశీల (పేరు మార్చాం)పై అదే గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌ అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిందితుడికి అనుకూలంగా మాట్లాడారు.

కేసు నమోదు చేయలేమనీ, వినయ్‌కుమార్‌తో కాంప్రమైజ్‌ కావాలని ఒత్తిడి తెచ్చారు. పోలీసుల వ్యవహారంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సుశీల వారి ఎదుటే బుధవారం (ఆగస్టు 29) ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని సుశీల భర్త తెలిపారు. కాగా, ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. స్టేషన్‌ ఇన్‌చార్జి సుభాష్‌కుమార్‌తో సహా ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. నిందితుడు వినయ్‌కుమార్‌ను అరెస్టు చేశామని ఎస్పీ ఎస్‌ఎన్‌.చినప్ప తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement