లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Woman Commit Suicide Due To Molested By Neighbor In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు(మాడుగుల) : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత మహిళ గనిపల్లి మరియకుమారి (24) మంగళవారం అర్ధ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడుగుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి అన్నారావు తన అక్క కూతురైన మరియకుమారిని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. బడ్డీకొట్టు నడుపుతూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గనిపల్లి దిలీప్‌లెవి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా దిలీప్‌లెవి తన సెల్‌ ఫోన్‌ను పిల్లలతో మరియకుమారి వద్దకు పంపించి ఆమెతో మాట్లాడాలంటూ లైంగికంగా  వేధిస్తున్నాడు. ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దిలీప్‌లెవి గతంలో రెండు మొబైల్స్‌ను పంపించగా మరియకుమారి భర్త అన్నారావు తీసుకొని గొడవపడ్డారు.

మంగళవారం సాయంత్రం మరో మొబైల్‌ఫోన్‌ పిల్లలతో పంపించగా గమనించిన భర్త తీసుకొని ఆమె తల్లి, తమ్ముడికి విషయం తెలిపాడు. తమ్ముడు దారివేముల సునీల్‌ అక్కను మందలించగా తనకు ఏ పాపం తెలియదని, దిలీప్‌లెవి తనను చాలా కాలంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. అనంతరం మనస్తాపానికి గురైన మరియకుమారి అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రపోతుండగా ఇంట్లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నిద్రలేచిన భర్తకు భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలికి తొమ్మిదేళ్ల మానసిక దివ్యాంగుడైన కుమారుడు అశోక్, పదేళ్ల ప్రమీళ, మూడేళ్ల లతిక, 14 నెలల రుషి ఉన్నారు. అమ్మా...లే అంటూ పిల్లలు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top