సంచలనంగా మారిన సంగీత మిస్సింగ్‌ కేసు

Student Sangeetha Goes Missing From School At Alwal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్వాల్‌ భూదేవినగర్‌కు చెందిన విద్యార్థిని సంగీత మిస్సింగ్‌ కేసు సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సంగీత నిన్న(మంగళవారం) స్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూలు యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు తప్పిపోయిందని ఆరోపించారు. అయితే స్కూల్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు స్కూలుకు యూనిఫామ్‌లో వచ్చిన సంగీత.. డ్రెస్‌ మార్చుకుని బయటికి వెళ్లిపోయినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. స్కూలు ఆవరణలో ఉన్న తమకు సంగీత బ్యాగు ఇచ్చి బయటికి వెళ్లిపోయినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. అంతేకాకుండా కనిపించకుండా పోవడానికి ముందు స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సంగీత ఆమె దగ్గర నుంచి గాజులు తీసుకుని వచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇంటి నుంచి బయల్దేరే ముందే ఆధార్‌ కార్డు కూడా తీసుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అతడిపైనే అనుమానం..
సంగీత కనిపించకుండా పోవడానికి కారణం రాకేశ్‌ అనే యువకుడంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురికి మాయ మాటలు చెప్పి అతడే కిడ్నాప్‌ చేసి ఉంటాడంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంగీత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాకేశ్‌ ఆచూకీ కోసం ఒక బృందాన్ని పంపినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top