అల్లుడి చేతిలో మామ హతం

Son Law Attack Uncle Died In Karimnagar - Sakshi

సిరిసిల్లక్రైం (కరీంనగర్‌): దంపతుల మధ్య గొడవ జరగడంతో కూతురు పుట్టింటికి వచ్చింది. కాపురం నిలబెడదామనుకున్న తండ్రి పెద్దమనషులను తీసుకుని అల్లుడి ఇంటికి వెళ్లాడు. కోపోద్రిక్తుడైన అల్లుడు మామపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరిసిల్లలోని శివానగర్‌కు చెందిన బండారి సత్యనారాయణ (51) మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివానగర్‌లో బండారి సత్యనారాయణ నివాసం ఉంటున్నాడు. పవర్‌ లూం కార్మికుడికి పని చేస్తున్నాడు. తన కూతురు నిఖితను ఏడాదిన్నర క్రితం బీవైనగర్‌కు చెందిన మహేందర్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. వీరికి మూడు నెలల కూతురు ఉంది. కొద్దిరోజులుగా నిఖిత, మహేందర్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తనను వేధిస్తున్నాడని నిఖిత మూడ్రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. ఆదివారం అత్తవారింటికి వచ్చిన మహేందర్‌ తన కూతురును తీసుకెళ్లాడు. పవర్‌లూం పనికెళ్లి ఇంటికి వచ్చిన సత్యనారాయణకు మనమరాలు కన్పించకపోవడంతో  కూతురును ఆరా తీశాడు. మహేందర్‌ తీసుకెళ్లాడని చెప్పడంతో అదేరోజు రాత్రి పెద్దమనషులను తీసుకుని అతడి ఇంటికి వెళ్లాడు. అక్కడ మాటమాట పెరిగి కోపోద్రిక్తుడైన మహేందర్‌ సత్యనారాయణపై దాడి చేశాడు. మెడ నరాలకు గట్టిగా దెబ్బతగిలింది. గాయపడిన సత్యనారాయణను బంధువులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు మృతుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. విచారణ చేస్తున్నట్లు ఎస్సై చినానాయక్‌ వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top